
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్(Hyderabad City) సిటీలో హైడ్రా(HYDRA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్లో(Banjara Hills) శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు.
వివరాల ప్రకారం.. బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఆక్రమణకు గురైన ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా గుర్తించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు.. స్థలాన్ని పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో, శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు.. అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. కాగా, వీఆర్ ఇన్ఫ్రా పార్థసారథి, ఆయన కుమారుడు విజయ్ భార్గవా భూమిని కబ్జా చేసినట్టు తెలిసింది.
షేక్పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్-10లో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. గతంలో ప్రభుత్వం ఐదు ఎకరాల్లో జలమండలికి 1.20 ఎకరాలను కేటాయించింది. 1.20 ఎకరాలతో పాటు మొత్తం ఐదు ఎకరాల భూమి తనదంటూ పార్థసార్థి కోర్టుకెక్కారు. అనంతరం, చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపాలా పెట్టారు. కాగా, కోర్టులో వివాదం ఉండగానే మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకున్నారు.

వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి ఆక్రమణలకు పార్థసారథి పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు హైడ్రా నిర్ధారించుకుంది. తరువాత 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.