
నగరం మరోసారి తడిసిముద్దయింది. బుధవారం రాత్రి కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వరకు ఏకధాటిగా ఐదు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో నగర జన జీవనం అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్లుగా కురిసిన వర్ష ఉద్ధృతితో నగర వాసులు బెంబేలెత్తిపోయారు.
వర్షం దాటికి నిమిషాల వ్యవధిలోనే రోడన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు అపార్ట్మెంట్లతోపాటు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరగా, డైనేజీ, ఓపెన్ నాలాలు పొంగిపొర్లాయి. మెట్రో స్టేషన్లు, బ్రిడ్జిల కింద భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి.

భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాíఫిక్ జామ్ అయింది. మాదాపూర్–హైటెక్ సిటీ చౌరస్తా, రాయదుర్గం, అమీర్పేట బంజారాహిల్స్ ఐకియా మార్గంలో, మియాపూర్– చందానగర్ నగర్ మార్గంలో రహదారిపై వాహనాలు ముందుకు కదల్లేదు. దీంతో ముంబై జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 12 గంటల వరకు అత్యధికంగా ముషీరాబాద్ తాళ్లబస్తీలో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం.

ఒకరు మృతి
హైదరాబాద్లో ఐదు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో.. విషాదం నెలకొంది. బల్కంపేట రైల్వే బ్రిడ్జి కింద వరద నీటిలో పడి ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడిని ముషీరాబాద్ భోలక్పూర్కు చెందిన షర్పుద్దీన్గా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

:::సాక్షి, సిటీబ్యూరో