‘గ్రూప్‌-1’పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీజీపీఎస్సీ | TGPSC Challenges High Court Single Bench Order on Group-1 Results Cancellation | Sakshi
Sakshi News home page

‘గ్రూప్‌-1’పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీజీపీఎస్సీ

Sep 17 2025 2:21 PM | Updated on Sep 17 2025 2:27 PM

Group1 row: TGPSC Approached Telangana HC Division Bench Details

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌ 1 అంశంపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను టీజీపీఎస్సీ(TGPSC) బుధవారం ఆశ్రయించింది. ఇంతకు ముందు సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. గ్రూప్‌ 1 ఫలితాలు, ర్యాంకులు రద్దు చేస్తూ ఈ నెల 9న హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను, మార్చి 30న ప్రకటించిన జనరల్‌ ర్యాంకులను రద్దు చేస్తూ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల్లో... టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్లను ఇచ్చింది. 

ఒకటి.. మెయిన్స్‌ జవాబు పత్రాలను ఎలాంటి అవకతవకలు లేకుండా రీవాల్యూయేషన్‌ చేయాలి. సంజయ్‌సింగ్‌ వర్సెస్‌ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్‌(సాధారణ పద్ధతి)గా మూల్యాంకనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాలి. ఆ రీవాల్యూయేషన్‌లోనూ పొరపాట్లు జరిగితే పరీక్ష నిర్వహణకు కోర్టే ఆదేశిస్తుంది. 

రెండోది.. 2024 అక్టోబరు 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్‌ను రద్దు చేసి, పరీక్షలను తిరిగి నిర్వహించాలి. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రక్రియను ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలి అని హైకోర్టు స్పష్టంచేసింది.  మరోవైపు ఈ తీర్పుపై గ్రూప్‌-1 ర్యాంకర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈక్రమంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో తదుపరి ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement