
వార్ధాకు బదులు తుమ్మిడిహెట్టి బరాజ్పై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటాం
పాలన రెండేళ్లు పూర్తయ్యే నాటికి ప్రాజెక్టుల పనుల్లో ఫలితాలు కనిపించాలి
నీటిపారుదల శాఖపై సమీక్షలో మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి సత్వరమే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం, వార్ధా ప్రాజెక్టులుగా విభజించగా, వార్ధా ప్రాజెక్టును పక్కనపెట్టి తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించాలనే అంశంపై త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నీటిపారుదల శాఖపై సోమవారం ఆయన జలసౌధలో ఉన్నతస్థాయిలో సమీక్షించారు.
డిసెంబర్లోగా ఫలితాలు కనిపించాలి
నిర్మాణంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగిరం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. డిసెంబర్తో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకునే నాటికి గుర్తించదగని ఫలితాలను ప్రజలకు అందించాలని స్పష్టం చేశారు.
» సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులతోపాటు టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) క్లియరెన్స్కు ఈ నెల 23న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్వహించను న్న సమావేశానికి సర్వం సిద్ధం కావాలని సూచించారు. సమ్మక్కసాగర్తో ఛత్తీస్గఢ్లో ఏర్పడనున్న ముంపుపై ఇ ప్పటికే అధ్యయన నివేదిక అందిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి సత్వరమే ఎన్ఓసీ సాధించాలని సూచించారు.
» సీతమ్మసాగర్, మోడికుంటవాగు ప్రాజెక్టులతోపాటు చనాకా–కొరాటా, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ వ్య వస్థలకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) కింద కేంద్ర నిధులకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ల ను వారం రోజుల్లోగా సీడబ్ల్యూసీ నుంచి పొందాలని ఆదేశించారు.
» ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పున:పంపిణీ అంశంపై కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట ఈ నెల 23–25 తేదీల్లో రాష్ట్రం తరఫున వినిపించనున్న తుది వాదనలకు తాను స్వయంగా హాజరవుతానని, సమయం లభిస్తే సీఎం రేవంత్ సైతం హాజరవుతారని తెలిపారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్తో మరోసారి సమావేశమై చర్చిస్తామన్నారు.
డిజైన్ల తయారీ బాధ్యత సీడీఓదే...
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమి టీ సిఫారసులను కచ్చితంగా అనుసరిస్తూ మేడిగడ్డ, అ న్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణకు డిజైన్లను రూపొందించే బాధ్యత శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీ ఓ)దేనని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. విఫలమైన బరాజ్లలోని లోపాలను సరిదిద్ది పునరుద్ధరించేందుకు అవసరమైన డిజైన్లు రూపొందించే నైపుణ్యం తమకు లేదని సీడీఓ చీ ఫ్ ఇంజనీర్ నిస్సహాయత వ్యక్తం చేయడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజైన్ల తయారీకి ఐఐటీ రూర్కీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను నియమించుకోవాలని ఆదేశించారు.
కొడంగల్ తొలి ప్రాధాన్యం
కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలను తొలి ప్రాధాన్యంగా తీసుకొని భూసేకరణను పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డి, జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీ మా, కోయిల్సాగర్ను అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులుగా పరిగణించి సత్వరం పూర్తి చేయాలన్నారు. వీటితో పాటు డిండి, ఎస్ఎల్బీసీ, నక్కలగండి ప్రాజెక్టుల మిగులు భూసేకరణను సత్వరం పూర్తి చేయాలన్నారు. జూ రాల ప్రాజెక్టుపై ప్రత్యామ్నా య బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
10న ఛత్తీస్గఢ్కు మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ నెల 10న ఛత్తీస్గఢ్ రాజధాని న్యూ రాయ్పూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం విష్ణుదేవ్ సాయితో సమావేశం అవుతారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకి అనుమతుల విషయంలో ఈ నెల 23న కేంద్ర జలసంఘం కీలక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఆలోగా ప్రాజెక్టుకి ఎన్వోసీ జారీ చే యాలని ఛత్తీస్గఢ్ సీఎంకు ఉత్తమ్ విజ్ఞప్తి చేయనున్నారు.
పూడిక తొలగింపుతో ఏటా రూ.500 కోట్లు
మిడ్మానేరు, కడెం ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపునకు చర్యలు ప్రారంభించడం ద్వారా పూడిక తొలగింపుపై జాతీయ పాలసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. జూరాల, సాగర్, శ్రీరాంసాగర్, హుస్సేన్సాగర్, ఇతర ప్రాజెక్టుల్లో సైతం పూడిక తొలగింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పూడిక తొలగింపుతో ప్రభుత్వానికి ఏటా రూ.500 కోట్ల అదనపు ఆదాయం రానుందని, అన్ని జలాశయాల్లో చేపడితే రూ.3,000–4,000 కోట్లకు ఆదాయం పెరుగుతుందన్నారు.
» ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాల పునరుద్ధరణలో భాగంగా హెలికాప్టర్లతో నిర్వహించతలపెట్టిన ఏరియల్ మా గ్నటిక్ సర్వేకు డీజీసీఏ నుంచి సత్వరంగా అనుమతులు తీసుకొని సర్వేను చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
» మూడు దశాబ్దాల తర్వాత శాఖలోని ఇంజనీర్లకు ఇటీవల పదోన్నతులు కల్పించిన నేపథ్యంలో ఈ నెల 14న సాయంత్రం 5 గంటలకు జలసౌధలో నిర్వహించనున్న కృతజ్ఞత సభకు ఏర్పాట్లు చేయాలన్నారు.