27 చోట్ల అభ్యర్థులు
సాత్తూరులో నైనార్
మైలాపూర్లో తమిళిసై
కోవై ఉత్తరం వానతీ
అన్నామలైకు
నో సీట్
సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడే కమలనాథుల జాబితాను బీజేపీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. 27 చోట్ల తామర చిహ్నంలో అభ్యర్థులు పోటీలో ఉంటారని వెల్లడించారు. ఇందులో 26 చోట్ల బీజేపీ నేతలకు అవకాశం ఇవ్వగా, ఒక సీటును దక్షిణ భారత ఫార్వడ్ బ్లాక్ నేత తిరుమారన్కు అప్పగించారు.
బీజేపీకి 27 స్థానాలను అన్నాడీఎంకే కేటాయించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల ఎంపికకు ఎక్కువ సమయాన్నే బీజేపీ తీసుకోక తప్పలేదు. ఎట్టకేలకు శుక్రవారం జాబితాను విడుదల చేశారు. 2021 ఎన్నికలలో బీజేపీ 20 చోట్ల అభ్యర్థులను నిలబెట్టగా నాలుగు చోట్ల గెలిచిన బీజేపీ తాజా ఎన్నికలలో 27 స్థానాలలో కమలం చిహ్నంతో పోటీ చేయనుంది. తమకు అన్నాడీఎంకే ఓ సీటు కేటాయించగా, బీజేపీ మరో సీటు కేటాయిస్తుందన్న ఎదురు చూపులలో ఉన్న పుదియనీదికట్చినేత ఏసీ షణ్ముగంకు షాక్ తప్పలేదు. ఆయన పార్టీకి బీజేపీ సీటు కేటాయించక పోగా, దక్షిణ భారత ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు తిరుమారన్కు తిరుపత్తూరు సీటు అప్పగించడం గమనార్హం. ఇక బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు సీటు దక్కలేదు. తాను ఆశించిన స్థానాన్ని అన్నాడీఎంకే ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఎన్నికలలో పోటీ చేయడం లేద ని ఇప్పటికే ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జాబి తా వెలువడడంతో అభ్యర్థుల గెలుపునకు కృషిచేస్తానని ప్రకటించారు.
మారిన స్థానాలు
ఈసారి పార్టీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తన సిట్టింగ్ స్థానం తిరునల్వేలిలో కాకుండా సాత్తూరుకు మకాం మార్చారు. కోయంబత్తూరు దక్షిణం సిట్టింగ్ ఎమ్మెల్యే , మహిళామోర్చా అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఒక్కసారైనా ఎన్నిక ల్లో గెలవాలన్న ఆశతో మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ను ఎంపిక చేసుకున్నారు. పలు దఫాలు ఓడిన కేంద్ర సహాయ మంత్రి పదవికి డోకా లేదన్న ధీమాతో ఉన్న ఎల్.మురుగన్కు ఈ సారి అవినాశి (రి) నియోజకవర్గం దక్కింది. నాగర్కోయిల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గాంధికి మళ్లీ అవకాశం కల్పించారు. ఇక, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విజయధరణికి ఎట్టకేలకు సీటు దక్కింది. ఉప ఎన్నికలలో ఆమెకు సీటు ఇవ్వలేదు. ఎట్టకేలకు సీటు దక్కించుకున్న ఆమె నాలుగో సారిగా అసెంబ్లీలో అడుగు పెడతారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.


