తిరువళ్లూరు: యువత తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు అవకాశం దక్కిన రంగాల్లో ప్రావీణ్యం సంపాదించి రాణించాలని నటుడు రాజా అన్నారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్ఎండీ కళాశాలలో 25వ వార్షికోత్సవం, క్రీడా దినోత్సవం జరిగింది. క్రీడల్లో విజయం సాధించిన వారికి బహుమతులను ప్రదానం చేసే కార్యక్రమం విద్యాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ మునిరత్నం అధ్యక్షతన నిర్వహించారు. హాస్య నటుడు రాజా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాజా మాట్లాడుతూ విద్యార్థుల్లో సాధించాలన్న ఆత్మవిశ్వాసం, కఠినంగా శ్రమించాలన్నతత్వం వుండాలన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యా అభ్యసనం అవసరమన్న ఆయన, యువత ప్రతిఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమకు వచ్చిన రంగంలో ప్రావీణ్యం సాధించాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఎప్పుడూ విశ్వాసంగా వుండాలని సైతం ఆయన సూచించారు. ఇటీవల యువతలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి తగ్గి, ఐటీ రంగాలపై ఆసక్తి మరింత పెరిగిందన్నారు. అయితే ఐటీ రంగాల్లోని ఉద్యోగులకు ఇటీవల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వాపోయారు. అలా కాకుండా ఆహ్లాదరకరమైన వాతావరణంలో పనిచేయాలని ఆయన సూచించారు. అనంతరం రూ.67.17లక్షలు విలువ చేసే బహుమతులను ప్రదానం చేశారు. దీంతో పాటు సమర్పణ్–26 సావనీర్ను సైతం విడుదల చేశారు. వైస్ చైర్మన్ ఆర్ఎం కిషోర్, సలహాదారుడు మాజీ ఐఏఎస్ అధికారి పిచ్చాండి, కళాశాల ప్రిన్సిపల్ అన్బుచెళియన్, డీన్ త్యాగరాజన్ పాల్గొన్నారు.


