– అగ్నికి బుగ్గి అయిన వాహనాలు
తిరుత్తణి: తిరుత్తణి రైల్వే స్టేషన్ సమీపంలో చెత్తకుప్పలో మంటలు చెలరేగడంతో సమీపంలోని సీజ్ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. తిరుత్తణి గాంధీరోడ్డు వద్ద రైల్వేస్టేషన్ సమీపాన మద్యపాన నిషేధిత విభాగ పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడికి సమీపంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మూతపడి దుస్థితిలో వున్న పాత తహసీల్దార్ కార్యాలయం, పక్కనే ఇళ్లు, రైల్వే ట్రాకు, దుకాణాలు వున్నాయి. పాతపడిన తహసీల్దారు కార్యాలయానికి సమీపంలో మున్సిపాలిటీ సిబ్బంది చెత్తకుప్పలు తీసుకొచ్చి డంపింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు చెత్త కుప్పకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి ప్రమాదానికి దారితీసింది. పోలీసులు వివిధ కేసుల్లో సీజ్ చేసి ఉంచిన వాహనాలకు మంటలు వ్యాపించాయి. కారు,. వ్యాన్ సహా బైకులు అంటుకున్నాయి. ఇది గమనించిన ఆ ప్రాంతం వాసులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది హటాహుటిన అక్కడికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలు ఆర్పింది. దీంతో ఆ ప్రాంతం వాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


