సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాట డీఎంకే కీలక నేత పొన్ముడి, ఆయన తనయుడు గౌతమ శిఖామణికి పెద్ద ఊరట కలిగింది. ఎర్ర మట్టి క్వారీ కేసులో ఇద్దర్నీ నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ మేరకు విల్లుపురం జిల్లా సెషన్స్ కోర్టు గురువారం సాయంత్రం తీర్పు వెలువరించింది.
కేసు నేపథ్యం
2006–2011 మధ్య కాలంలో పొన్ముడి మంత్రిగా ఉన్న సమయంలో,విల్లుపురం జిల్లా పూత్తురై గ్రామంలోని ఎరమ్రట్టి క్వారీలో అనుమతించిన దానికంటే ఎక్కువగా తవ్వకాలు జరిపారని ఆరోపణలు వచ్చాయి. సుమారు 2,64,644 లోడ్ల మట్టిని అక్రమంగా తరలించి, ప్రభుత్వానికి రూ. 28.36 కోట్ల నష్టాన్ని కలిగించారని 2012లో అన్నాడీఎంకే ప్రభుత్వం హయాంలో జిల్లా నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పొన్ముడి, ఆయన కుమారుడు గౌతమసిగమణి సహా మొత్తం 8 మందిపై విచారణ జరిగింది. విల్లుపురం జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మణిమొళి తుది తీర్పును వెలువరించారు. ఆరోపణలను నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. ఈ కేసులో సాక్షులుగా పేర్కొన్న 57 మందిలో 33 మంది తమ వాంగ్మూలాన్ని మార్చుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు. క్వారీ నిర్వహణకు తగిన అనుమతులు ఉన్నాయని, నిబంధనల ఉల్లంఘన జరిగిందనడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ నిందితులందరినీ కోర్టు విడుదల చేసింది.
ధర్మం గెలిచింది: పొన్ముడి
తీర్పు అనంతరం పొన్ముడి విలేకరులతో మాట్లాడుతూ.. 2012లో అన్నాడీఎంకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాపై ఈ అక్రమ కేసులను బనాయించిందన్నారు. ఇది తప్పుడు కేసు అని నిరూపితమైందన్నారు. ఈ విజయం దివంగత కరుణానిధి, ముఖ్యమంత్రి స్టాలిన్ , తమ పార్టీ కార్యకర్తలందరి విజయం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.


