సాక్షి, చైన్నె: దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి సులభంగా ఓటు వేసి వెళ్లేందుకు వీలుగా అన్ని వసతులు కల్పిస్తున్నామని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు వివరణ ఇచ్చింది. దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేలా తగిన వసతులు కల్పించాలని కోరుతూ వైష్ణవి జయకుమార్ అనే దివ్యాంగుల హక్కుల కార్యకర్త మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషనన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్ బెంచ్కు ఎన్నికల కమిషన్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. దివ్యాంగుల హక్కుల చట్ట నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ర్యాంప్ సౌకర్యం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంప్ మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని కమిషన్ స్పష్టం చేసింది. కాగా విచారణ సమయంలో పిటిషనర్ తరపు న్యాయవాది ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో తాత్కాలికంగా ర్యాంప్లు ఏర్పాటు చేయడం కాకుండా, ప్రభుత్వ భవనాల్లోని పోలింగ్ కేంద్రాల్లో శాశ్వత ర్యాంప్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. దీంతో దివ్యాంగుల భవిష్యత్తులో కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటుందని విన్నవించారు. న్యాయమూర్తులు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, దివ్యాంగులకు సులభతరమైన ఓటింగ్ కోసం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు , భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ను దాఖలు చేయాలని ఎన్నికల కమిషనన్ను ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.


