తమిళసినిమా: ఒక్కో నటుడికి ఒక్కో చిత్రం బ్రేక్ ఇస్తుంది. అందుకు తగిన సమయం సందర్భం రావాల్సి ఉంటుంది. అలా లాక్డౌన్ చిత్రంతో బ్రేక్ తెచ్చుకున్న నటుడు వినాయకరాజ్. ఈయన లాక్డౌన్ చిత్రంలో అనుపమపరమేశ్వరన్తో కలసి ముఖ్యపాత్రను పోషించి పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు. అంతే కాకుండా ఆ చిత్రంతో అభిమానుల మనసును గెలుచుకున్నారు. ఇంతకుముందు తిరుపతి, ఆంజనేయ, శిఖరంతొడు , పులి వరుదు, మామనిధన్, పిజ్జా 3, లైన్మెన్ వంటి పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా కథానాయకుడిగా అవతారం ఎత్తారు. సూర్య, జ్యోతిక జంటగా నటించిన ఉయిరిలే కలందదు చిత్రం ఫేమ్ కేఆర్ జయ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రంలో వినాయకరాజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని ఈయన చెప్పారు. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వినాయకరాజ్ వ్యక్తం చేశారు. ఇకపై మంచి కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తానని ఆయన పేర్కొన్నారు.
అనుపమ పరమేశ్వరన్, వినాయకరాజ్


