స్ట్రాంగ్రూమ్కు సీల్ వేస్తున్న అధికారులు
ఈవీఎంలను స్ట్రాంగ్ రూముకు తరలిస్తున్న సిబ్బంది
తిరువళ్లూరు: లాటరీ విధానంలో ఈవీఎంలను ఎంపిక చేసి వాటిని గోడౌన్ నుంచి తరలించిన క్రమంలో తిరువళ్లూరు నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను స్థానికంగా వున్న ప్రయివేటు పాఠశాలలో వుంచి అధికారులు సీల్ వేశారు. తిరువళ్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రల్ 23న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వాహణ కోసం లాటరీ విధానం ద్వారా ఈవీఎంలను ఎంపిక చేసి వాటిని పది నియోజకవర్గాలకు బుధవారం ఉదయం నుంచి తరలిస్తున్నారు. ఈక్రమంలోనే తిరువళ్లూరుకు చేరిన ఈవీఎంలను స్థానికంగా వున్న సెయింటానీస్ ప్రయివేటు పాఠశాల గదిలో వుంచిన అధికారులు, గురువారం ఉదయం రాజకీయ పార్టీలకు చెందిన నేతల సమక్షంలో సీల్ వేశారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
తిరుత్తణిలో..
తిరుత్తణి: తిరుత్తణి నియోజకర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో వినియోగించనున్న ఈవీఎంలను తిరుత్తణిలోని స్ట్రాంగ్రూమ్కు గురువారం చేరాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతాప్ ఆధ్వర్యంలో అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓట్లు నమోదు శాతం పెంపొందించే విధంగా అవగాహన కార్యక్రమాలు, ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణి నియోజకవర్గంలోని 337 పోలింగ్ కేంద్రాల్లో వినియోగించనున్న ఈవీఎంలు, కంట్రోలర్, వీవీ ప్యాట్లు గురువారం తిరుత్తణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూముకు చేరాయి. నియోజకవర్గ ఎన్నికల నిర్వహణాధికారి కణిమొళి అధ్యక్షతన పటిష్ట పోలీసుల భద్రత నడుమ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్రూములో భద్రపరిచారు.


