సాక్షి, చైన్నె : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం కేంద్ర ప్రభుత్వంపై, ఢిల్లీలోని బీజేపీ పెద్దలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను తీవ్రంగా ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుప్పూర్లో జరిగిన కార్యక్రమంలో, గతంలో తనకు ఎదురైన అవమానకర సంఘటనను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
పన్నీరు ఆవేదన
ఒక ముఖ్యమైన విషయంపై చర్చించడానికి కేంద్ర మంత్రిని సమయం కోరినట్టు తెలిపారు. ఆయన రమ్మంటేనే తమిళనాడు నుండి ఢిల్లీకి వెళ్లినట్టు , అయితే అక్కడికి వెళ్లాక ఒక ప్రత్యేక రిసెప్షన్ గదిలో కూర్చోబెట్టారన్నారు. సుమారు 15 నిమిషాల తర్వాత ఒక అసిస్టెంట్ వచ్చి. మంత్రిని కలిసే అవకాశం లేదని పేర్కొంటూ వెళ్లి పోవాలని ఆదేశించారాన్నరు. ఒకప్పుడు ఒక పెద్ద పార్టీకి సమన్వయకర్తగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఢిల్లీలో జరిగిన అవమానం ఇది అని ఉద్వేగానికి గురయ్యారు. ఇది వ్యక్తిగత అవమానం కాదని, తమిళ ప్రజలకు జరిగిన అవమానంగా వ్యాఖ్యలు చేశారు.
డీఎంకే వైపు మొగ్గు
ఈ సందర్భంగా పన్నీర్సెల్వం తన రాజకీయ ప్రస్థానంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత అమ్మ జయలలిత మరణించినానంతరం తాను ఎంతో ఒత్తిడిలో ఉన్నానని, తాజాగా డీఎంకేతో అడుగులు వేయడంతో సంతోషంగా ఉన్నానని వివరించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు తనను సరిగ్గా గౌరవించడం లేదన్న అసంతృప్తిని పదే పదే ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు. అలాగే, గతంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేస్తూ, తనపై కావాలనే కుట్రలు జరుగుతున్నాయని, ఒకప్పుడు తనను గౌరవించిన వారే ఇప్పుడు ఢిల్లీలో అనుమతి ఇవ్వకుండా తిరస్కరించడం బాధాకరమన్నారు.


