తిరుత్తణి: వడారన్నేశ్వరర్ ఆలయంలో పంగుణి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో ఆదివారం ప్రారంభమయ్యాయి. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి అనుబంధం తిరువలంగాడు వడారన్నేశ్వరర్ ఆలయం నటరాజర్ అరంగేట్రం చేసి ఐదు సభల్లో తొలిసభ రత్నసభగా తిరువలంగాడు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఏటా పంగుణి బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహించడం పరిపాటి. ఈమేరకు ఆదివారం ఉదయం మూలవర్లకు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభానికి శివాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. పది రోజుల పాటు నిర్వహించనున్న వేడుకల్లో రోజూ మూలవర్లకు అభిషేక పూజలతోపాటు ఉత్సవర్లు స్కోమస్కందర్ వాహన సేవల్లో కొలువుదీరి గ్రామ వీధుల్లో ఊరేగనున్నారు. రథోత్సవం 28న ఉదయం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను తిరుత్తణి ఆలయ నిర్వాహకులు చేశారు.


