తమిళ భాషకు అధిక ప్రాధాన్యం
వేలూరు: విద్యార్థులు తమిళ భాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అన్నారు. వేలూరు కంభన్ కయగం ఆధ్వర్యంలో ప్రపంచ మాతృభాషా దినోత్సవం వేలూరు పట్టణంలో జరిగింది. వేలూరు కంభన్ కయగం చైర్మన్, వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అధ్యక్షత వహించి ప్రసంగించారు. తమిళ భాషను పది కోట్ల మంది ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ నేడు తమిళం మాట్లాడే వారి సంఖ్య తగ్గుతూనే ఉందన్నారు. ఇందుకు కారణం నేటి విద్యార్థులు పత్రికలు, తమిళ భాష పుస్తకాలు చదవకపోవడమే కారణమన్నారు. తమిళ బాష మాట్లాడడం అనేది అవమానం కాదని మన గుర్తింపుగా భావించాలన్నారు. నేడు మనం ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తమిళ భాషను మరిచిపోతున్నామని ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తమిళ భాషను మన భావితరాలు మరిచి పోయే పరిస్థితి ఉందన్నారు. అమెరికన్ ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒకసారి తమిళ తరగతులు నిర్వహిస్తారన్నారు. తమిళ బాషను ప్రజల వద్దకు మొట్ట మొదటి సారిగా తీసుకెళ్లిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై మాత్రమే అన్నారు. ప్రతిఒక్కరూ తమిళ భాషను చదవాలన్నారు. వేలూరు కంభన్ కయగం కార్యదర్శి చోళనాతన్, కోశాధికారి తిరునావక్కరసు, జ్ఞానవేల్, తిరునావక్కరసు, తమిళ సంఘం రచయితలు, కవులు, తమిళ పండిట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


