2026లో భారీ విజయం మనదే!
సాక్షి,చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో మళ్లీ అధికారం మనదే అని డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం యువ సమూహం మరింతగా శ్రమించాలని పిలుపు నిచ్చారు. విరుదునగర్ వేదికగా శనివారం సాయంత్రం డీఎంకే యువజన విభాగం దక్షిణ మండల కార్యనిర్వాహకుల మహానాడు జరిగింది. యువజన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత కనిమొళి కరుణానిధి, సీనియర్ నేతలు కేఎన్ నెహ్రు, పొన్ముడి, తిరుచ్చి శివ, ఐ పెరియస్వామి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై తీశ్రంగా విరుచుకు పడ్డారు.
అంత నిర్లక్ష్యమా..?
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు ఇవ్వక పోగా, తమిళనాడు ప్రజలపై తీవ్ర నిర్లక్ష్యం, వివక్షను చూపించడం భావ్యమా అని ప్రశ్నించారు. ప్రజలకు కేంద్రంతో ఈ సారి ఒరిగింది సున్నా అని వ్యాఖ్యలు చేశారు. విద్యా, మెట్రో రైలు ప్రాజెక్టుల నిధులు ఇవ్వాలని కోరితే, కనీసం స్పందించ లేదన్నారు. హోసూర్ విమానాశ్రయానికి కూడా అనుమతి ఇవ్వక పోవడం శోచనీయమని మండి పడ్డారు.
ద్రవిడ మోడల్ పాలనకు అండగా..
2026 ఎన్నికల్లో ద్రావిడ మోడల్ అమలు చేసిన ప్రాజెక్టులకు తోడుగా, యువ సమూహం,మహిళా లోకం అండతో 200 స్థానాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. యువత రోజూ అంకితం భావంతో పనిచేయాలని, సామాజిక న్యాయం, భాషా గౌరవం, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం సాగుతున్న పోరాటంలో మరింత ముందుడాలని పిలుపు నిచ్చారు. ఇక్కడున్న యువ సమూహం ఇస్తున్న ఆదరణ, మద్దతు తో ద్రావిడ మోడల్ 2.ఓ అధికారంలోకి రావడం తథ్యం అని, 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే విజయం సాధించడం తథ్యమన్నారు.


