ఖాకీలకు.. లబ్ధి
సాక్షి, చైన్నె: సస్పెన్షన్కు గురైన పోలీసు అధికారుల మళ్లీ విధులోకి తీసుకునే విధంగా డీజీపీ వెంకటరామన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ దృష్ట్యా 200 మందికి పైగా పోలీసులు, అధికారులకు ఊరట కలిగింది. వివరాలు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆరోపణలపై ఏడాదికి పైగా సస్పెండ్ అయిన పోలీసు అధికారుల కేసులను సమీక్షించి, అర్హులైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ జి. వెంకటరామన్ తన ఆదేశాలలో పేర్కొన్నారు. డిసెంబర్ 31, 2025 నాటికి రాష్ట్రంలో అవినీతి, విధులలో నిర్లక్ష్యం, దుష్ప్రవర్తన తదితర కేసుల కింద మొత్తం 439 మంది పోలీసు అధికారులు సస్పెన్షన్కు గురై ఉన్నారని డీజీపీ జారీ చేసిన సర్క్యూలర్లో వివరించారు.. వీరిలో చాలా మంది సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా విధులకు దూరంగా ఉన్నారని తెలిపారు. కాగా సస్పెన్షన్ కాలంలో పోలీసు అధికారులకు కనీస వేతనం చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వానికి అనవసర ఆర్థిక భారం పడుతోందని, అందుకే సస్పెన్షనన్ను ఎక్కువకాలం కొనసాగించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు అందులో వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి కేసునూ, అందులోని ఆధారాల మేరకు విడివిడిగా పరిశీలించి, అర్హులైన పోలీసు అధికారులపై ఉన్న సస్పెన్షన్ను రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈ ప్రక్రియలో భాగంగా 200 మందికి పైగా పోలీసు అధికారులను తిరిగి విధుల్లోకి పిలిపించేందుకు సిద్ధమయ్యారు. అలాగే అవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ)కు సంబంధించిన కేసుల విషయంలో ఆ శాఖను సంప్రదించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకోవాలని డీజీపీ సూచించారు. తిరిగి నియమితులయ్యే పోలీసు అధికారులపై శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని, వారు పూర్తిగా నిర్దోషులని తేలే వరకు ప్రాధాన్యత లేని పోస్టుల్లో మాత్రమే నియమించాలి అని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


