బ్రహ్మోత్సవ శోభ
సాక్షి, చైన్నె: చైన్నె జీఎన్చెట్టి రోడ్డులో వెలసిన తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో బ్రహోత్సవ శోభ సంతరించుకుంది. శుక్రవారం కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం చేయనున్నారు. చైన్నె టి.నగర్ వెంకటనారాయణ రోడ్డులో తిరుమల శ్రీవారికి బ్రహ్మాండ ఆలయం కొలువై ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. అలాగే శ్రీవారి దేవేరి పద్మావతీ అమ్మవారికి చైన్నె జీఎన్ చెట్టి రోడ్డులో బ్రహ్మాండ ఆలయాన్ని 2023లో నిర్మించారు. తిరుచానూరు(అలమేలు మంగాపురం)లోని పద్మావతీ అమ్మవారి ఆలయాన్ని తలపించే విధంగా ఈ ఆలయం అద్వితీయంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయ కుంభాభిషేకం కనుల పండువగా గతంలో జరిగింది. ఆలయం నిర్మించి ప్రస్తుతం మూడేళ్లు అవుతోంది. మూడో వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ స్థానిక అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఘనంగా కుంకుమార్చన
పద్మావతీ అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం కుంకుమార్చన సేవ జరిగింది. సాయంత్రం విష్వక్సేన ఆరాధనతో పాటు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. శనివారం ఉదయం బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరగనుంది. అదే రోజు రాత్రి చిన్న శేష వాహన సేవకు ఏర్పాట్లు చేశారు. 8వ తేదీన ఉదయం పెద్ద శేష వాహనం, రాత్రి హంస వాహనం, 9వ తేదీ ఉదయం ముత్యపు పందిరి, రాత్రి సింహ వాహనం, 10వ తేదీన ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి హనుమంత వాహనం, 11వ తేదీ ఉదయం పల్లకి ఉత్సవం, రాత్రి గజ వాహన సేవ నిర్వహించనున్నారు. 12వ తేదీ ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహన సేవకు ఏర్పాట్లు చేశారు. 13వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ, 14వ తేదీన ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 15వ తేదీ చక్రస్నాన మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా 16వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు, అభి షేకాలు, అలంకరణలు వైభవంగా జరగనున్నాయి. అమ్మవారి వాహన సేవ ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
బ్రహ్మోత్సవ శోభ


