మోదీ, అమిత్ షా సభలకు కసరత్తు
సాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాల నేతృత్వంలో బహిరంగ సభల కసరత్తులలో రాష్ట్ర బీజేపీ వర్గాలు నిమగ్నమయ్యాయి. మదురై, సేలంలలో ఈ పర్యటనలు జరగనన్నాయి. వివరాలు.. డీఎంకేను గద్దె దించడం, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకు రావడం లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ పాలకులు వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. తమ వ్యూహాల అమలు కోసం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్నేతృత్వంలో ఇద్దరు సహాయ మంత్రులతో కూడిన కమిటీని ఇప్పటికే రంగంలోకి దించారు. పార్టీకి పట్టున్న నియోజకవర్గాలను గుర్తించి, అక్కడ ఇన్చార్జ్లను రంగంలోకి దించి కార్యక్రమాలను ఈ కమిటీ వేగవంతం చేసింది. అదే సమయంలో కేంద్ర పథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లడం లక్ష్యంగా కేంద్ర మంత్రుల పర్యటనలకు కసరత్తులు మొదలెట్టారు. ఈనెల 15 తదుపరి రోజుకో కేంద్ర మంత్రి తమిళనాడులో పర్యటించేందుకు సన్నద్దం అవుతున్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ద్వారా బహిరంగ సభల నిర్వహణ కసరత్తులు వేగవంతం చేశారు. గత నెల మొదటి వారంలో పుదుకోట్టై, తిరుచ్చిలలో అమిత్ షా పర్యటన, గత నెల చివరి వారంలో మోదీ మధురాంతకం సభ సూపర్ సక్సెస్ కావడంతో మంచి జోష్ మీదున్న బీజేపీ వర్గాలు, మరిన్ని బహిరంగ సభలకు ఏర్పాట్లు చేపట్టాయి. ఇందులో భాగంగా మదురైలో మోదీ సభకు, సేలంలో అమిత్ షా సభకు కసరత్తులు మొదలెట్టారు.
మదురైలో మోదీ సభ నిర్వహణకు సంబంధించిన స్థల పరిశీలన గురువారం జరిగింది. మదురై రింగ్ రోడ్డులోని అమర్ దిడల్, వళ్లియల్కుళం, ఉత్తలాడిలలో సభకు సంబంధించిన స్థల పరిశీలన జరిగింది. పోలీసుల ఇచ్చే అనుమతి మేరకు ఒక స్థలాన్ని ఎంపిక చేసి ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఈనెల మూడో వారంలో పీఎం మోదీ పుదుచ్చేరిలో పర్యటించనున్న దృష్ట్యా, ఆ తదుపరి తేఇలలో మదురైలో సభకు చర్యలు చేపట్టారు. అలాగే, సేలంలోనూ అక్కడి నేతలు బ్రహ్మాండ వేదిక కసరత్తులకు సన్నద్ధమయ్యారు. సేలం విమానాశ్రయం సమీపంలోని మైదానాన్ని ఎంపిక చేశారు. ఈనెల 14న అమిత్ షా పుదుచ్చేరి రానుండడంతో ఆ తదుపరి తేదీలలో సేలంలో సభకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.


