3,719 మంది వంట సహాయకుల నియామకం
కొరుక్కుపేట: తమిళనాడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖలో 8,997 వంటశాల అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. కానీ రెండు నెలలు గడిచినా నియామక ఉత్తర్వులు జారీ కాలేదు. ఇది అభ్యర్థులలో అసంతప్తికి కారణమైందని ఇటీవల వార్తలు రావడంతో అధికారులు స్పందించాయి. దీంతో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 3,719 వంట సహాయకులకు నియామక ఉత్తర్వులు తాజాగా జారీ చేశారు. వీరిని 21 జిల్లాల్లో నియమిస్తామని.. మిగిలిన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తమ ఉత్పత్తి యూనిట్గా ఐసీఎఫ్కు అవార్డు
కొరుక్కుపేట:2024–25 సంవత్సరంలో తన అసాధారణ ఉత్పత్తి పనితీరుకు గుర్తింపుగా చైన్నె పెరంబూరులోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)కి రైల్వే మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి గాను ఉత్తమ ఉత్పత్తి యూనిట్ షీల్డ్ను ప్రదానం చేసింది. న్యూడిల్లీ వేదికగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును రైల్వేల మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ యు. సుబ్బారావు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే సహాయ మంత్రి వి. సోమన్న, ఐసీఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ ఎన్. సీతారాం ప్రసాద్, రైల్వే బోర్డు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
కస్టమ్స్ అధికారులకు
బటన్ కెమెరాలు
సాక్షి, చైన్నె : చైన్నె విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చొక్కలో ధరించే బటన్ కెమెరాలను అందించారు. దీని ద్వారా విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులపై నిఘాను మరింత పటిష్టం చేశారు. చైన్నె విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే విమానాలలో ప్రయాణించే వారి నుంచి బంగారం, విదేశీ కరెన్సీ, ఇతర వస్తువులతో పాటూ తరచూ మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు సీజ్చేస్తూ వస్తున్నారు. తాజాగా ప్రయాణికుల కదలికలపై నిఘా ఉంచే విధంగా తమ చొక్కాలకు బటన్ కెమెరాలను ధరించి ముందుకెళ్లే పనిలో పడ్డారు. ఈ కెమెరాలను కంట్రోల్రూమ్కు అనుసంధానించి, ప్రత్యేక బృందం ప్రయాణికుల కదలికలు, వారి హావా భావాల ఆధారంగా స్మగ్లింగ్కు పాల్పడే వారిని పసిగట్టే దిశగా ముందుకెళ్తున్నారు.
3 అమృత్ భారత్ రైళ్లు
సాక్షి, చైన్నె : తమిళనాడులోని పలు నగరాల నుంచి ఉత్తరాధిలోని అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అమృత్ భారత్ రైలు సేవలను అందించేందుకు రైల్వే యంత్రాంగం సిద్ధమైంది. చైన్నె తాంబరం నుంచి చంద్రకాశి, తిరుచ్చి – జల్పై గురి, నాగర్కోయిల్ – జల్పైగురి మధ్య ఈ అమృత్భారత్ రైలు సేవలకు చర్యలు తీసుకున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈనెల 17 లేదా 18వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైళ్లకు జెండా ఊపనున్నారు.
మెకానికల్ ఆటోమేషన్పై శ్వేత పత్రం విడుదల
సాక్షి, చైన్నె : విద్యుత్ రహిత మెకానికల్ ఆటోమేషన్ ఫ్యాక్టరీ సైకిల్ సమయాన్ని 50 శాతానికి పైగా తగ్గించేందుకు వీలుందని , భారీ మూలధన పెట్టుబడి లేకుండా ఎర్గోనామిక్స్ స్థిరత్వాన్ని మెరుగు పరుస్తుందని అధ్యయనంలో తేల్చారు. ఇందుకు సంబంధించిన నివేదిక , శ్వేత పత్రాన్ని గ్రేట్ లెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ , మద్రాసు మేనేజ్మెంట్ సహకారంతో శనివారం విడుదల చేశారు. ఫౌండేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎఫిషియెన్సీ, కరాకురి కై జెన్ అండ్ ది లాజిక్ ఆఫ్ లోకాస్ట్ ఇన్నోవేషన్ పేరుతో దీనిని విడుదల చేశారు. ప్రాథమిక పరిశోధన, అధ్యయనం శక్తి రహిత మెకానికల్ ఆటోమేషన్ , మూల ధన పెట్టుబడి లేకుండా ఉత్పాదకత, ఎర్గోనామిక్స్ తదితర అంశాలపై నిశిత పరిశీలనతో పలు వివరాలను ఇందులో పొందు పరిచారు. శ్రామిక శక్తితో ఆన్ గ్రౌండ్ ఆధారంగా అధ్యాపక బృందం అధ్యయనం చేశారు. కార్యక్రమంలో అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్లు, రచయితలు, ఇతర ప్రతినిధులు డాక్టర్ ఎన్ వివేక్, డాక్టర్ ఎంఎస్ నరసింహ, ఆసియా పసిఫిక్ అండ్ ఇండియా మాజీ సీఈఓ బి. శంతానం తదితరులు పాల్గొన్నారు.
3,719 మంది వంట సహాయకుల నియామకం


