డీఎంకేను సాగనంపుదాం!
సాక్షి, చైన్నె: డీఎంకేను ఇంటికి పంపిద్దామని ప్రజలకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పిలుపు నిచ్చారు. కరూర్ ఘటన పరిణామాలతో నెల రోజులుగా విజయ్ ప్రజా సమస్యలపై ఎలాంటి స్పందన లేకుండా ఉంటూ వచ్చారు. రాజకీయ కార్యక్రమాలు కూడా ముందుకు సాగలేదు. ఈ పరిస్థితులలో సోమవారం కరూర్ బాధితులను చైన్నెకు పిలిపించి పరామర్శించారు. ఆయన తీవ్ర ఉద్వేగంతో తమను పరామర్శించినట్టుగా బాధితులు అనేక మంది పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నెల రోజుల తర్వాత ప్రజా సమస్యపై స్పందిస్టూ విజయ్ ప్రకటన విడుదల చేశారు. వరి కొనుగోలలో నిర్లక్ష్యాన్ని వివరిస్తూ, పేదల కడుపు కొట్టడమే కాకుండా, రైతులను కన్నీటి మడుగులో ముంచుతున్న డీఎంకేను ఇంటికి పంపిద్దామని ప్రజలకు పిలుపు నిస్తూ ఈ ప్రకటన చేశారు. అదేవిధంగా వర్షాల నేపథ్యంలో ఎదురు అవుతున్న సమస్యలను వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు.


