క్లుప్తంగా
మినీవ్యాన్ ఢీకొని రైతు మృతి
తిరువళ్లూరు: మినీవ్యాన్ ఢీకొని ఓ రైతు మృతిచెందాడు. ఈఘటన తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ మెయ్యూరు మేట్టు వీధికి చెందిన రాజ్కుమార్(45) రైతు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. ఇతను వేంబేడులో ఫార్మ్హౌస్ పేరిట వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ వేర్వేరు పంటలను సాగుచేస్తున్నాడు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం వెంగల్కు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంలో వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. సీతంజేరి సమీపంలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన మినీవ్యాన్ రాజ్కుమార్ను ఢీకొంది. ఈప్రమాదంలో రాజ్కుమార్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. విషయం తెలిసి సంఘటన స్థలానికి వెళ్లిన వెంగల్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని కై వసం చేసుకుని శవపరీక్షను పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాణసంచా పేలుడు కేసులో నలుగురి అరెస్ట్
తిరువళ్లూరు: అక్రమంగా టపాసులు నిల్వ వుంచడానికి ఇంటిని అద్దెకు ఇచ్చిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన ముగ్గురిని అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్ తండురైలో గత నాలుగు రోజుల క్రితం ఇంట్లో అక్రమంగా నిల్వ వుంచిన టపాసులు పేలి నలుగురు మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ ఈప్రమాదంపై పట్టాభిరామ్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో టపాసులను అక్రమంగా నిల్వ వుంచడానికి ఇంటిని అద్దెకు ఇచ్చిన అదే ప్రాంతానికి చెందిన ఆర్ముగం(50)తోపాటు టపాసుల విక్రయానికి సహకరించిన సోదరుడి దామోదరన్(41), ఆర్ముగం కుమారుడు విజయన్(21) పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నటి మనోరమ కుమారుడు భూపతి కన్నుమూత
తమిళసినిమా: దివంగత ప్రఖ్యాత నటిమణి మనోరమ కుమారుడు, నటుడు భూపతి (70) గురువారం ఉదయం చైన్నెలో కన్నుమూశారు. కుటుంబం ఒరు కదంబం చిత్రం ద్వారా నటుడుగా పరిచయమైన భూపతి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించారు. కాగా భూపతి కుటుంబం స్థానిక టీ.నగర్ , నీలకంఠ మెహతా వీధిలో నివశిస్తున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన భూపతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది గత వారమే డిశ్చార్జ్ అయ్యారు. అలాంటిది గురువారం ఉదయం 12.40 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. భూపతికి భార్య ధనలక్ష్మి, రాజరాజన్ అనే కొడుకు, అభిరామి, మీనాక్షి అనే కూతుర్లు ఉన్నారు. భూపతి మతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు దక్షిణ భారత నటినటుల సంఘం తరఫున ఉపాధ్యక్షుడు కరుణాస్ ఆయన భౌతికయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూపతి భౌతికకాయానికి శుక్రవారం స్థానిక టీనగర్ కన్నమ్మపేటలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.
మహిళ గొంతు కోసి హత్య
వివాహేతర ప్రియుడి కోసం గాలింపు
అన్నానగర్: ధర్మపురి జిల్లాలోని పాలక్కోడు సమీపం కొమ్మ నాయకన అల్లి న్యూ నేషనల్ హైవే పై గురువారం 45 ఏళ్ల మహిళ రక్తపు మడుగులో మృతి చెందింది. పాలక్కోడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కత్తితో ఆ మహిళ గొంతు కోసి హత్య చేసినట్లు తేలింది. దీని తర్వాత మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. దర్యాప్తులో హత్యకు గురైన మహిళ ధర్మపురి జిల్లా కరిమంగళం సమీపం మందైవీది గ్రామానికి చెందిన గణేషన్ భార్య వల్లి (40) అని తేలింది. వివాహం అయిన 3 సంవత్సరాల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. దీని కారణంగా, ఒంటరిగా నివసించిన వల్లికి కొందరితో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులకు ముందు, తిరుప్పూర్లో తన కుమార్తెను చూడడానికి వెళ్లి తిరిగి వచ్చిన వల్లి గురువారం ఉదయం గొంతు కోసిన స్థితిలో మృతదేహంగా కనిపించింది. విచారణలో వల్లికి తిరుచ్చికి చెందిన పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్తో పరిచయం ఉందని వెల్లడైంది. దీంతో పుష్పరాజ్పై అనుమానం ఏర్పడింది. అతన్ని అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసులు తిరుచ్చికి చేరుకున్నారు.
క్లుప్తంగా
క్లుప్తంగా


