
క్లుప్తంగా
ఎన్పీసీఐతో మ్యూజ్ వేరబుల్స్ ఒప్పందం
కొరుక్కుపేట: దేశంలో మొట్టమొదటి ధరించగలిగే చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో భారత బహుళజాతి టెక్ సంస్థ మ్యూజ్ వేరబుల్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఐటీ మద్రాసులో జరిగిన కార్యక్రమంలో స్వదేశీ వాలెట్ వ్యవస్థల అవసరాన్ని హైలైట్ చేస్తూ మ్యూజ్ వేరబుల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కె.ఎల్.ఎన్. సాయి ప్రశాంత్ మాట్లాడుతూ భారతదేశానికి నిజంగా సార్వభౌమ ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం ద్వారా డిజిటల్ వాలెట్ పర్యావరణ వ్యవస్థలో విదేశీ టెక్ దిగ్గజాలను తాము ఎదుర్కొంటున్నామన్నారు. ఇది ప్రపంచ స్థాయి సాంకేతికతను దేశంలోనే నిర్మించవచ్చని రుజువు చేస్తుందన్నారు. మ్యూజ్ వాలెట్తో నగదు రహిత చెల్లింపులను సులభంగా చేస్తున్నామన్నారు. రాబోయే రెండు సంవత్సరాలలో, లక్షలాది మంది రూపే కార్డ్ హోల్డర్లు ధరించగలిగే చెల్లింపుల సౌలభ్యాన్ని అనుభవించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. భారతదేశంలో పూర్తిగా అభివృద్ధి చేయబడి, రూపొందించబడి, తయారు చేయబడిన మ్యూస్ ధరించగలిగే వస్తువులు చెల్లింపుల సాంకేతికత కలిసి నిజంగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ విజయాన్ని సూచిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
రూ.45 లక్షల నగదు దోపిడీ
తిరువొత్తియూరు: చైన్నె నెర్కుండ్రం విజయలక్ష్మి ప్రాంతానికి చెందిన శాంతకుమార్(42) కోయంబేడు మార్కెట్లో కూరగాయల టోకు వ్యాపారం చేస్తున్నాడు. అతని దుకాణంలో చిన్మయనగర్ 3వ వీధికి చెందిన నారాయణన్(35) గత 5 సంవత్సరాలుగా నగదు వసూలు చేసే పని చేస్తున్నాడు. గత ఆగస్టు 22న రాత్రి కొత్తవాల్సావడి మార్కెట్లో లక్షలు వసూలు చేసుకుని వస్తుండగా, కోయంబేడు సమీపంలో ఆరుగురు గ్యాంగ్ నారాయణన్పై దాడి చేసి నగదు దోచుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పల్లవరం ప్రాంతానికి చెందిన మొయిదీన్(24), తాంబరం ప్రాంతానికి చెందిన అయ్యప్పన్(అలియాస్)రమేష్ (25)లను అరెస్టు చేశారు. ఈ ప్రధాన నిందితుడు తిరుప్పూర్ జిల్లాలోని ఒక లాడ్జిలో దాగి ఉన్నట్టు సమాచారం అందింది. దీని ఆధారంగా, కోయంబేడు క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జానకిరామన్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ యువరాజ్ నేతృత్వంలో తిరుప్పూరుకు వెళ్లారు. తిరుప్పూరులో పలు ప్రాంతాల్లో గాలించి, కోయంబత్తూరు ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున చుట్టుముట్టి అరెస్టు చేశారు. విచారణలో అతను కోయంబత్తూరు జిల్లాకు చెందిన విజయరాజ్(34) అని తెలిసింది.
కార్మికుడి హత్య
అన్నానగర్: తూత్తుకుడిలోని అలగేషపురానికి చెందిన ఉదయకుమార్ భార్య ఇంద్ర. వీరి కుమారుడు సోలైయప్పన్(24). ఇతను కూలీ కార్మికుడు. వీరి ఇంటి సమీపంలో సుబ్బయ్య, భార్య వల్లి నివశిస్తున్నారు. వీరి కుమారుడు సెల్వకుమార్(32). ఇతను ఆ ప్రాంతంలో ఒక దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం ఇంద్రకు, అదే ప్రాంతంలో నివశించే ఆమె సోదరికి మధ్య వివాదం జరిగింది. ఇది చూసిన వల్లి అక్కడికి వెళ్లి ఆమెను మందలించింది. ఈ స్థితిలో అక్కడికి వచ్చిన సోలైయప్పన్ వల్లిని దూషించాడని తెలుస్తుంది. దీంతో మనస్తాపం చెందిన వల్లి తన కుమారుడు సెల్వకుమార్కు జరిగిన విషయం చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన సెల్వకుమార్ కత్తితో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. తన తల్లి వల్లి గురించి చెడుగా ఎలా మాట్లాడుతావని చెబుతూ సోలైయప్పన్ను కత్తితో పదే పదే పొడిచాడని తెలుస్తుంది. ఇందులో తీవ్రంగా గాయపడిన సోలైయప్పన్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి సెల్వకుమార్ను అరెస్టు చేశారు. అరెస్టయిన సెల్వకుమార్ నెల క్రితమే వివాహం చేసుకోవడం గమనార్హం.
‘పీఏ’ వృత్తికి జాతీయ
గుర్తింపు అవసరం
సాక్షి, చైన్నె: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ అసిస్టెంట్ నేతృత్వంలో ఐఏపీఏసీఓఎన్ –2025 21వ వార్షిక సదస్సు చైన్నెలో జరిగింది. ఇందులో ఫిజిషియన్ అసిస్టెంట్(పీఏ) వృత్తికి జాతీయ గుర్తింపు అవసరమని తీర్మానించారు. అలాగే ఆరోగ్య సంరక్షణ ప్రయాణం, విధాన రూపకల్పన, జాతీయ గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి హజరైన ఐఏపీఏ అధ్యక్షుడు గోమతి సుందర్, జేఐపీఏ కో ఎడిటర్ డాక్టర్ తన్మయ్, అశిష్ గౌర్, కావేరి ఆస్పత్రిమెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్కుమార్, ఫ్రాంటియర్ లైఫ్ లైన్ ఆస్పత్రి ఉపాధ్యక్షులు డాక్టర్ సంథ్యా చెరియన్, ఎమ్మెల్యే ఎలిళన్, మద్రాసు మెడికల్మిషనర్ చైర్మన్ డాక్టర్ రాజన్, స్టేట్ హెల్త్ కౌన్సిల్ కార్యదర్శి బీఎస్ దేశికామణి హాజరై ది జర్నీ ఆఫ్ ఫిజిషియన్ అసోసియేట్ అండ్ ఐఏపీఏ గురించి డాక్యుమెంటరీ విడుదల చేశారు. జర్మల్ ఆఫ్ ది ఇండియన్ ఫిజిషియన్ అసిస్టెంట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.