
చైన్నె సరిహద్దు రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం
● రూ.2689.74 కోట్ల పనులకు భూమిపూజ
తిరువళ్లూరు: చైన్నె బోర్డర్ రోడ్డు ప్రాజెక్టు పనుల కింద రూ.2689.74 కోట్లు వ్యయంతో నిర్మించనున్న పనులకు గురువారం ఉదయం తిరువళ్లూరు జిల్లా ఈకాడు కండ్రిగ వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉధయనిధి స్టాలిన్ భూమి పూజ చేశారు. తమిళనాడులోని ఉత్తర, దక్షిణ జిల్లాల నుంచి ఎన్నూర్ పోర్టుకు భారీగా వాహనాల రాకపోకలు చైన్నె మీధుగా సాగుతున్నాయి. ఈ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న క్రమంలో రద్దీని తగ్గించడం, ఉత్తర, దక్షిణ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భారీ వాహనాలు సులభంగా ఎన్నూరు పోర్టుకు చేరడానికి కొత్త రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఎన్నూరు పోర్టు నుంచి మహాబలిపురం వరకు 132.87 కిమీ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. మొత్తం సిక్స్వే రోడ్లు నిర్మాణం చేయనున్న క్రమంలో పనులను ఐదు దశలుగా విభజించి నిర్మిస్తున్నారు. మొదటి దశలో ఎన్నూరు నుంచి తచ్చూరు వరకు 25.40 కిమీ పొడువుతో నిర్మాణాన్ని రూ.2122.10 కోట్లు వ్యయంతో చేపట్టి ప్రస్తుతం 35 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. రెందో దశలో తచ్చూరు నుంచి తిరువళ్లూరు సమీపంలోని ఈకాడుకండ్రిగ వరకు 26.10కిమీ దూరంతో 1539.69 పనులు చేపట్టి చేస్తున్నారు. ప్రస్తుతం 68 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో దశలో జరగనున్న పనులకు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గురువారం ఉదయం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మూడో దశ పనులను(మూడుభాగాలుగా విభజించి) ఈకాడు కండ్రిగ నుంచి వెంగత్తూరు వరకు 10.4 కిమీ పనులను రూ.1133.20 కోట్లు వ్యయంతో సిక్స్వేగాను, వెంగత్తూరు నుంచి చెంగాడు వరకు 10 కిమీ పొడవున రూ.593.27 కోట్లు వ్యయంతో, చెంగాడు నుంచి శ్రీపెరంబదూరు వకు 9.70 కిమీ 963.27 కోట్లు వ్యయంతో మొత్తానికి రూ.30.10 కిమీ రోడ్డు పనులను రూ.2689.74 కోట్లు వ్యయంతో చేపట్టనున్నారు. నాలుగో దశ పనులను శ్రీపెరంబదూరు నుంచి సింగపెరుమాళ్ ఆలయం వరకు 23.80 కిమీ, ఐదో దశలో సింగపెరుమాళ్ ఆలయం నుంచి మహాబలిపురం వరకు 28.24 కిమీ దూరంలో రోడ్డు నిర్మాణం చేయనున్నట్టు ఉధయనిధి స్టాలిన్ వివరించారు. పనులను దక్కించుకున్న సంస్థలు సకాలంలో పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత వుండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేలు, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు కృష్ణస్వామి, తిరుత్తణి చంద్రన్, తిరువళ్లూరు వీజీ రాజేంద్రన్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.