సూర్యాపేట : రైతులు వరి సాగుకు స్వస్తి పలికి, లాభసాటిగా ఉండే ఆయిల్పామ్ తోటల సాగువైపు మళ్లాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట మండలంలోని కాసరాబాద్లో ఆయిల్పామ్ తోటను కలెక్టర్ పరిశీలించి మల్లేష్ అనే రైతుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరి సాగుతో పోలిస్తే ఆయిల్పామ్లో పెట్టుబడి భారం చాలా తక్కువని తెలిపారు. ఒక్కసారి ఈ తోటను నాటితే నాలుగు సంవత్సరాల నుంచి మొదలై ఏకంగా 30 సంవత్సరాల వరకు రైతులకు స్థిరమైన, అధిక ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు 70 శాతం నుంచి 90 శాతం వరకు సబ్సిడీని అందిస్తున్నాయని తెలిపారు. తోట నాటిన మొదటి నాలుగు సంవత్సరాల వరకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి రూ.4,200 చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆయిల్పామ్ తోటల్లో మొదటి మూడు సంవత్సరాల వరకు అంతర పంటలను సాగు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి తీగల నాగయ్య, వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్తయ్య, సూర్యాపేట డివిజన్ ఉద్యాన అధికారి కట్ట స్వాతి, ఉద్యాన విస్తరణ అధికారులు యారాల సుధాకర్ రెడ్డి, రంగు ముత్యం రాజు, వంగూరి అనిల్, ఆయిల్ ఫెడ్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ నిమ్మ గోపికృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ భవిష్య, రైతులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్


