మోతె : వైద్య ఆరోగ్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మోతె మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ వైద్య సౌకర్యాలను పరిశీలించడంతోపాటు ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం బదిలీపై వెళ్లిన వైద్యాధికారి సంతకాలు, సంబంధిత అనుమతులు ఇంకా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్ పేరు మార్చి పేదింటి ఆడబిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రభుత్వ అత్యవసర మందులు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు. ఎంతో ఉపయోగకరమైన కంటి వెలుగు పథకాన్ని అటకెక్కించారని విమర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శీలం సైదులు, ఆరె లింగారెడ్డి, ఏలూరి వెంకటేశ్వరరావు, బానోతు శంకర్నాయక్, ఇండ్ల వెంకటేశ్వర్లు, గాంధీ తదితరులు ఉన్నారు.


