పంచాయతీ హస్తగతం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ హస్తగతం

Dec 18 2025 7:23 AM | Updated on Dec 18 2025 7:23 AM

పంచాయతీ హస్తగతం

పంచాయతీ హస్తగతం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ మద్దతుదారులకే అత్యధిక సర్పంచ్‌ స్థానాలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. ఆ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీకి 63.90 శాతం స్థానాలు లభించగా, బీఆర్‌ఎస్‌కు 26.71 శాతం స్థానాలు, బీజేపీకి 1.23 శాతం స్థానాలు వచ్చాయి. సీపీఐ/సీపీఎం/ఇతరులకు 8.15 శాతం స్థానాలు దక్కాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం బుధవారంతో ముగిసింది. ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో గ్రామ పంచాయ తీ ఎన్నికలను నిర్వహించింది. ఈ నెల 11, 14వ తేదీల్లో ఒకటి, రెండు విడతల ఎన్నికలు జరగ్గా, మూడో విడత ఎన్నికలు బుధవారం ముగిశాయి.

1779 పంచాయతీల్లో ఎన్నికలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడతల్లో 1782 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అయితే, నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం పేరూరు, మాడుగులపల్లి మండలం అభంగాపురంలో సర్పంచి అభ్యర్థుల్లేక సర్పంచ్‌ స్థానాలకు, అదే మండలంలోని ఇందుగులలో న్యాయ వివాదంతో సర్పంచ్‌తో సహా వార్డుల సభ్యుల స్థానాల ఎన్నికలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1779 గ్రామాల్లో సర్పంచ్‌ స్థానాలకు, 1781 గ్రామాల్లో వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో రాత్రి 11:30 గంటల వరకు కూడా లెక్కింపు పూర్తి కాలేదు.

వివిధ పార్టీల మద్దతుదారులకు ఇలా..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు వితల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే అత్యధిక స్థానాలు దక్కాయి. సర్పంచి ఎన్నికలు జరిగిన 1779 స్థానాల్లో (జనగాం మినహా) కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులకు 1136 స్థానాలు దక్కాయి. బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు 475 స్థానాలు వచ్చాయి. బీజేపీకి 22 స్థానాలు రాగా, సీపీఐ/సీపీఎం/ఇతరులకు 145 స్థానాలు లభించాయి. అందులో స్వతంత్ర అభ్యర్థులే అత్యధికంగా ఉండటం గమనార్హం.

నల్లగొండలోనే కాంగ్రెస్‌కు అత్యఽధిక

సర్పంచ్‌ స్థానాలు

నల్లగొండ జిల్లాలో 869 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో కాంగ్రెస్‌ మద్దతుదారులకు 68.23 శాతం స్థానాలు లభించాయి. బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు 23.24 శాతం సర్పంచ్‌ స్థానాలు దక్కాయి. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్‌ మద్దతుదారులకు 64.60 శాతం, బీఆర్‌స్‌ మద్దతుదారులకు 25.51 శాతం దక్కాయి. యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్‌ మద్దతుదారులకు 53.75 శాతం, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు 34.97 శాతం సర్పంచి స్థానాలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement