కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసులు
గరిడేపల్లి: హుజూర్నగర్ నియోజకవర్గంలో కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. సోమవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, పోనుగోడు, గడ్డిపల్లి, కుత్భుషాపురం గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొందరు ఎస్ఐలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. చింతలపాలెం, గరిడేపల్లి పరిధిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, బైండోవర్ కేసులు పెడుతున్నారని తెలిపారు. తమ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని హెచ్చరించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ప్రజలకు కళ్లముందే కనిపిస్తోందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాంగ్రెస్ సరిగా అమలు చేయలేకపోతోందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి పోలీసు స్టేషన్కు పిలిపించి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలవవని పేర్కొన్నారు. కేసీఆర్ను వదులుకున్నామన్న ప్రశ్చాత్తాపం ప్రజల్లో మొదలైందన్నారు. మరో రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రజలే చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, కడియం వెంకట్రెడ్డి, మాశెట్టి శ్రీహరి, నల్లపాటి భాస్కర్, మేళ్లచెర్వు వెంకటరమణ పాల్గొన్నారు.
మాజీ మంత్రి జగదీష్రెడ్డి ఆరోపణ


