
ఉపాధి సిబ్బందికి అందని వేతనాలు
నాగారం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు అందడంలేదు. టీఏ(టెక్నికల్ అసిస్టెంట్లు), ఎఫ్ఏ( ఫీల్ట్ అసిస్టెంట్ల)కు మూడు నెలలుగా, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీలు, ఏపీఓలకు రెండు నెలలుగా జీతాలు రావడంలేదు. గ్రామాల్లో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న వీరికి నెలల తరబడి వేతనాలు రాక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు.
సిబ్బంది విధులు..
గ్రామసభలో గుర్తించిన వివిధ రకాల పనులు, రైతులు దరఖాస్తు చేసుకున్న పనులను టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్లలో నమోదు చేయించాలి. కొలతల ప్రకారం పనులను పంచాయతీ కార్యదర్శి, క్షేత్రస్థాయి సిబ్బంది, సీనియర్ మేట్లకు అప్పగించాలి. గ్రామాల్లో మేట్లు ఇచ్చిన కొలతలు సరిగా ఉన్నాయా, లేవా ప్రతి వారం తనిఖీ చేయాలి. చెక్ మెజర్మెంట్ను జూనియర్ ఇంజనీర్కు సమర్పించాలి. వారం చివరలో పనుల కొలతలు మస్టర్లలో, ఎంబీలలో నమోదు చేసి ఇంజనీర్ కన్సల్టెన్సీకి నివేదించాలి. తదుపరి ఆ రికార్డులను అదనపు కార్యక్రమం అధికారుల ద్వారా పరిశీలించి చెల్లింపులు చేయడానికి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఫీల్ట్ అసిస్టెంట్లు గ్రామాల్లో గుర్తించిన పనులను నిర్దేశించిన పని దినాల లక్ష్యం మేరకు ఉపాధి కూలీలతో చేయించాలి. మస్టర్లలో కూలీల హాజరుకు తోడు సెల్ఫోన్లో ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా రోజుకు రెండు సార్లు ఫొటో తీసుకోవడం, హాజరు ఆన్లైన్లో నమోదు చేయడం, కొలతల ప్రకారం పనులు చేయించడం, జాబ్ కార్డు నిర్వహణ, నర్సరీల నిర్వహణ, చెట్ల పెంపకం, వనమహోత్సవాలు, ఆత్మీయ భరోసా పనులు నిర్వహించాలి. వారంలో ఒక రోజు మండల కేంద్రాల్లో నిర్వహించే సమీక్షలకు హాజరై పనుల వివరాలు అధికారులకు అందించాలి.
కుటుంబ పోషణకు ఇబ్బందులు
టెక్నికల్ అసిస్టెంట్లకు ఒక్కొక్కరికి నెలకు వారి సర్వీసును బట్టి సుమారు రూ.20 వేల నుంచి రూ. 45వేలు, ఫీల్ట్ అసిస్టెంట్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.12,140 నుంచి రూ.11,500ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే వీరికి ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు అందలేదు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీలు, ఏపీఓలకు మే, జూన్ నెలల జీతాలు రాలేదు. దీంతో వీరంతా కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
టీఏ, ఎఫ్ఏలకు మూడు
నెలలుగా రాని జీతాలు
మిగతా సిబ్బందికి రెండు నెలలుగా..
కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు
పని భారం తీవ్రంగా ఉంది
ప్రస్తుతం మాకు ప్రభుత్వం నెలకు రూ.12,140 చొప్పున చెల్లిస్తుంది. దీంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించకపోవడంతో పనిభారం తీవ్రంగా ఉంది. ఒక్కో గ్రామంలో మూడు నాలుగు చోట్ల పనులు జరుగుతున్నప్పుడు వాటిని వెళ్లి పరిశీలించాలంటే ఇబ్బందులు పడుతున్నాం.
– ఎం.అంజయ్య, ఫీల్డ్అసిస్టెంట్, పస్తాల
వేతనాలు విడుదల చేయాలి
ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికితోడు మూడు నెలల వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం పెండింగ్ జీతాలు విడుదల చేసి, పే–స్కేల్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
– పి.రవి, ఏపీఓ, నాగారం

ఉపాధి సిబ్బందికి అందని వేతనాలు

ఉపాధి సిబ్బందికి అందని వేతనాలు