
సమగ్ర వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలి
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు సమగ్ర వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకొని ఏ భూమిలో ఏ పంట పండుతుందో, ప్రజలకు ఎంత పంట అవసరమో అంచనా వేసి వాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు, బ్యాంకు రుణాలు రైతాంగానికి అందించాలని కోరారు. ప్రతి సంవత్సరం కల్తీ విత్తనాలు, పురుగుల మందుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నకిలీ పురుగుల మందులు, విత్తనాలు లేకుండా చూడాలన్నారు. బనకచర్ల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలన్నారు. రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, ఏకలక్ష్మి పాల్గొన్నారు.