
ఏకత్వంలో భిన్నత్వం సృష్టిస్తున్న బీజేపీ
సూర్యాపేట : దేశంలో హిందుత్వం ముసుగులో ఏకత్వంలో భిన్నత్వాన్ని బీజేపీ సృష్టిస్తోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ ఆరోపించారు. గురువారం ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్తల సమ్మేళనం ముగింపు సభలో ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, శాసన మండలి సభ్యుడు కేతావత్ శంకర్ నాయక్ లతో కలిసి పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజనులకు ఏదైనా లబ్ధిచేకూరిందంటే అది కాంగ్రెస్ పార్టీతోనే అని చెప్పారు. ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆరోపించారు. బీజేపీ కుటిల ప్రయత్నాలను ప్రశ్నించిన ఏకై క వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలి అన్నారు. బీఆర్ఎస్ పాలకులు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్లు, బర్లు ఇచ్చారని విమర్శించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. గత పదేళ్లో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు విడుదల చేసిందన్నారు. సభలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, ఆదివాసీ కాంగ్రెస్ బునియాది శిక్షణ శిబిరం జాతీయ కోఆర్డినేటర్ రాహుల్ బాల్, కాంగ్రెస్ ఎస్టీసెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోట్య నాయక్ భూక్య, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, శిక్షణ శిబిరం ఇన్చార్జి లింగం, రాణా ప్రతాప్, కృష్ణ, శ్రీను, మల్లికార్జున్, మోహన్, గుగులోతు నాగు నాయక్ పాల్గొన్నారు.
ఫ శాసనసభ డిప్యూటీ స్పీకర్
రాంచందర్ నాయక్