
‘ఇన్స్పైర్’ అవుదాం
ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి
సమాజంలో నిత్యం ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కార రూపంలో ఆవిష్కరణలకు వేదికగా ఇన్స్పైర్ మనక్ నిలుస్తోంది. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సహకారంతో పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాలి. ఉపాధ్యాయులు విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలి. విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇన్స్పైర్ ఎంతగానో దోహదపడు తుంది. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలి.
– దేవరాజు, జిల్లా సైన్స్ అధికారి
ఫ ఇన్స్పైర్ మనక్ అవార్డులకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఫ సెప్టెంబర్ 15 వరకు గడువు
ఫ ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు
పురస్కారాలు
సూర్యాపేటటౌన్ : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి, వారిలో వినూత్న ఆలోచనలకు పదును పెట్టి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో ఇన్స్పైర్ మనక్ పురస్కారాలను అందిస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 15న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగనుంది.
ఎవరు అర్హులంటే..
10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయుడి గైడ్లైన్ పాటిస్తూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకునే విధానం..
● ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
● www.inspireawards-dst.gov.in వెబ్సైట్లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
● పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకొని, సేవ్ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళ్తుంది.
● వీరు ఆమోదిస్తే విద్యార్థికి సంబంధించి పొందుపర్చిన మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. అప్పుడు విద్యార్థి యూజర్ ఐడీకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
● విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది.
● విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టును సంక్షిప్తంగా వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి.
● ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం విద్యార్థి బ్యాంక్ ఖాతాకు రూ.10వేలు జమ చేస్తారు.
● రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు ఎంపికై తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అందిస్తారు.
● ఆన్లైన్లో ఉచితంగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
● 2024–25 విద్యా సంవత్సరంలో 950 పాఠశాలలకు సంబంధించి 88 నమూనాలు ఎంపికయ్యాయి. ఇందులో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించగా రాష్ట్ర స్థాయికి ఎనిమిది ప్రదర్శనలు ఎంపికయ్యాయి.
విద్యార్థులకు ప్రోత్సాహకాలు
ప్రాజెక్టులను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పరిశీలిస్తారు. ఎంపికైన ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం ఎంపిక చేసిన విద్యార్థి వ్యక్తిగత అకౌంట్లో రూ.10వేలు జమ చేస్తారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శననకు ఎంపికై తే రూ.25వేలు, జాతీయ స్థాయిలో ఎంపికై తే రూ.40 వేల నుంచి రూ.60వేల వరకు నగదు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందజేస్తారు. ప్రతిభావంతులకు ఐఐటీ, నీట్ ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.