
యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు
సూర్యాపేటటౌన్ : యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ , పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన ర్యాలీని ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేటను డ్రగ్స్రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాలు కనిపిస్తే వెంటనే 1908 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని లేదా 100కు డయల్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మన ప్రాంతాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ డ్రగ్స్ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందమైన జీవితాన్ని కూడా బలి తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ కలిగి ఉండడం నేరం అందుకు చట్టరీత్యా శిక్ష తప్పదని చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీడబ్ల్యూఓ రూప , ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ కృష్ణయ్య, డీటీడీఓ శంకర్, డీవైఎస్ఓ రామచంద్రరావు, అడిషనల్ ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్, నరసింహా చారి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
ఫ సూర్యాపేటలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు