
ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
హుజూర్నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మంగళవారం హుజూర్నగర్లో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది పక్కదారి పడుతోందని, నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోందన్నారు. దీంతో ప్రజలు ఆందోళలు, పోరాటాల బాట పడుతున్నారని చెప్పారు. ప్రజలు కదిలితే అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో సీపీఎం .. ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు.
ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఉగ్రదాడి
భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానంలో ఉంటే మోదీ ప్రభుత్వం నాలుగో స్థానంలో ఉందని గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. పహల్గాంలో ప్రభుత్వ వైఫల్య కారణంగానే ఉగ్ర దాడి జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడి జరుగుతుందని ఇంటలీజెన్స్ ద్వారా ప్రభుత్వానికి ముందే తెలుసని అందుకే ప్రధాని మోదీ తన పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపించారు. కాల్పుల విరమణ అనేది పాకిస్తాన్, భారత దేశానికి సంబంధించిందని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, పోలిశెట్టి యాదగిరిరావు, నాగారపు పాండు, ములకలపల్లి రాములు, కోట గోపి, పల్లె వెంకటరెడ్డి, పాండు నాయక్, దుగ్గి బ్రహ్మం, యాకూబ్, వి. సైదులు, పి. హుస్సేన్, శ్రీలం శీను, బాలు నాయక్ పాల్గొన్నారు.
ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం