
బాధితులకు అండగా ఉంటాం
సూర్యాపేటటౌన్ : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరించి బాధితులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించాలన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ కమిటీలో అగ్రస్థానం
ఫ ఉపాధ్యక్షులుగా ముగ్గురు
ఫ ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో నల్లగొండ జిల్లాకు అగ్రస్థానం దక్కింది. పార్టీ ఉపాధ్యక్ష పదవుల్లో ముగ్గురిని నియమించగా, ప్రధాన కార్యదర్శులు ఐదుగురికి స్థానం లభించింది. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్రెడ్డి, కొండేటి మల్లయ్య, గుమ్ముల మోహన్రెడ్డి నియమితులయ్యారు. కొండేటి మల్లయ్య ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గుమ్ముల మోహన్రెడ్డి నల్లగొండ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా బొజ్జ సంధ్యారెడ్డి, దైద రవీందర్, చనగాని దయాకర్, వి.రామారావుగౌడ్, చకిలం రాజేశ్వర్రావుకు అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే, ఇందులో గుమ్ముల మోహన్రెడ్డి, కొండేటి మల్లయ్య, చనగాని దయాకర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారే కావడం గమనార్హం. ఈ నియామకాలతో వారు డీసీసీ అధ్యక్ష పదవికి దూరం అయినట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
సూర్యాపేటటౌన్ : పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచి పిల్లల ఆరోగ్యం కాపాడాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నంబర్ –2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా లోని ప్రతి మండలం నుంచి ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు శానిటేషన్ వర్కర్లకు నిర్వహించిన జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్పీ అంకతి వెంకన్న పాల్గొన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో లంబాడ, ఎరుకల కులాల విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం కింద మంజూరైన 72 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద 3వ తరగతికి 36 సీట్లు, 5వ తరగతికి 18 సీట్లు, 8వ తరగతికి 18 సీట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ దరఖాస్తులను ఈనెల 9 నుంచి 13 వరకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఉచితంగా అందిస్తారని పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను ఈనెల 17 వరకు అందించాలని, ఈనెల 20న ఉదయం 11గంటలకు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సమక్షంలో విద్యార్థుల ఎంపికకు లక్కీ డ్రా తీయనున్నట్లు తెలిపారు.

బాధితులకు అండగా ఉంటాం