
ప్రజావాణి అర్జీలపై శ్రద్ధపెట్టాలి
ఫ ప్రజలకు సేవచేయడమే ఉద్యోగుల బాధ్యత
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి ప్రజావాణిలో వచ్చే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులకు సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే ఉద్యోగుల బాధ్యత అని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలన్నారు. ఒకవేళ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా స్థాయి అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించి విధులు, రిజిస్టర్ల నిర్వహణ, సరైన పద్ధతిలో ఫైల్స్ నిర్వహణకు దిశా నిర్దేశం చేయాలని సూచించారు. భూ సమస్యల దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజావాణికి రావాల్సిన అవసరం లేదని, జూన్ 20 వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులతో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దరఖాస్తులను అక్కడ అన్ని డాక్యుమెంట్లు జత చేసి ఽసమర్పించాలన్నారు. కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన మీగడ నర్సింహరావు కుమారుడు చరణ్ కుమార్కు భవిత కేంద్రం ద్వారా విద్యను బోధించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏ స్థాయిలో ఉందో అటవీ శాఖ ద్వారా వర్షం నీటి వినియోగం, వ్యవసాయ శాఖ ద్వారా ఏ పంటలకి ఎంత నీరు వినియోగిస్తున్నారో, ఉద్యానవన శాఖ ద్వారా డ్రిప్, మైక్రో ఇరిగేషన్ వివరాలు, నీటిపారుదల ద్వారా చెక్డ్యామ్ ల వివరాలు, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా బోర్ వెల్స్ వివరాలు, ఇండస్ట్రీస్ ద్వారా పరిశ్రమలు ఎంత నీరు వినియోగిస్తున్నారో, పపంచాయతీరాజ్ మున్సిపాలిటీలు గ్రౌండ్ వాటర్ రిసోర్స్ వివరాలు 15 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఈఓ అశోక్, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డీడబ్ల్యూఓ నరసింహారావు, డీసీఓ పద్మ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్ నాయక్, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.