
నకిలీ విత్తనాలను అరికట్టాలి
భానుపురి (సూర్యాపేట) : నకిలీ విత్తనాలను అరికట్టాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోటు లక్ష్మయ్య, బొడ్డు శంకర్లు డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్నందున రైతులకు సరిపడా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని కోరుతూ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీల వాళ్లు గ్రామాలకు వచ్చి నాణ్యమైన విత్తనాలు అంటూ రైతులకు అంటగట్టుతున్నారని, ఫలితంగా దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి బ్యాంకు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. రైతు భరోసాను అదేవిధంగా జిల్లాలో ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేయించి తూములకు లాకులు ఏర్పాటు చేసి లస్కర్లను వెంటనే నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అలుగుబెల్లి వెంకటరెడ్డి, దాసరి శ్రీను, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి, పగిడిమర్రి సోమయ్య, ధర్మాజీ, సామ నర్సిరెడ్డి, కామల శ్రీను, వీరనాయక్, మారయ్య,గాంధీ, బోనగిరి గిరి బాబు, కట్ల వీరన్న పాల్గొన్నారు.