
సీఎం వ్యాఖ్యలు ఆక్షేపనీయం
సూర్యాపేటటౌన్ : ఉద్యోగుల పట్ల సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపనీయమని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీపీఎఫ్కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు పాలకులకు అధికారాన్ని అప్పగించారని అన్నారు. ప్రజలందరి బాగోగుల కోసమే ఉద్యోగులు పనిచేస్తారని చెప్పారు.ప్రజల్లో భాగమే ఉద్యోగులు అన్న విషయాన్ని సీఎం గుర్తించుకోవాలన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు బోనస్ కోసం ఉద్యమాలు చేస్తున్నారని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడటం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు బండారు శ్రీనివాస్, శిరగాని యాకయ్య, సుధాకర్రెడ్డి, పోతురాజు నర్సయ్య, దీకొండ మహేష్, జిల్లా జానయ్య, ఎస్.కె.సుభాని, మల్లయ్య, తూము శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు.
కొలతల ప్రకారమే ఉపాధి కూలీలకు వేతనాలు
మోతె: ఉపాధిహామీ పథకం కూలీలకు కొలతల ప్రకారమే వేతనాలు అందుతాయని డీఆర్డీఓ అప్పారావు తెలిపారు. మంగళవారం మోతె మండల పరిధిలోని హుస్సేన్బాద్ గ్రామంలో ఉపాధి పనులను తనిఖీ చేశారు. మట్టి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి కూలీలతో ముచ్చటించారు. కూలీలందరూ ఉదయం 7 గంటలకు పనులకు హాజరవుతున్నారా? రోజుకు ఎంత కూలి వస్తుందని అడిగారు.రోజూ 150 మాత్రమే కూలి వస్తుందని కూలీలు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తే రోజుకు రూ.307 వేతనం అందుతుందన్నారు. పని ప్రదేశంలో కూలీలకు నీరు,నీడ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కూలీల మస్టర్లలో హాజరు తీసుకున్నారు. గ్రామంలో నర్సరీని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు, ఏపీఓ నాగేష్, పంచాయతీ కార్యదర్శి, ఈసీ శ్రీహరి, ఫీల్డ్అసిస్టెంట్ గజ్జి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం వ్యాఖ్యలు ఆక్షేపనీయం