‘స్వాహా’కారమే.. | - | Sakshi
Sakshi News home page

‘స్వాహా’కారమే..

Apr 30 2025 5:14 AM | Updated on Apr 30 2025 5:14 AM

‘స్వాహా’కారమే..

‘స్వాహా’కారమే..

అవినీతికి నిలయంగా కొన్ని సహకార సంఘాలు

కోదాడ: అన్నదాతలకు అండగా నిలిచి కష్ట సమయంలో అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఏర్పాటు చేసి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌) అవినీతికి కేరాఫ్‌గా మారాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, చైర్మన్‌లు కుమ్మక్కవుతూ రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల రాయితీలను కూడా తమ ఖాతాల్లోకి మార్చుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలు బయట పడినప్పుడు తాత్కాలిక విచారణ చేస్తున్న అధికారులు వారిని సస్పెండ్‌ చేసి చేతులు దులుపు కుంటున్నారు. ఇక వీరిపై విచారణ సంవత్సరాల తరబడి కొలిక్కి రాకపోవడంతో కాజేసిన సొమ్ము రికవరీ ప్రశ్నార్థకంగా మారింది.

అన్నదాతకు అండేది..

సూర్యాపేట జిల్లాలో 39 సహకార సంఘాలున్నాయి. ఇవి అన్నదాతలకు అన్ని విధాలుగా చేదోడు, వాదోడుగా ఉండడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులు, విత్తనాలు, ఎరువులను అందించడంతో పాటు పండిన ధాన్యం కొనుగోలు చేయడం వంటి ప్రాథమికమైన పనులను నిర్వర్తించడంతో విఫలమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతసేపటికీ సొసైటీ నిధులను ఎలా ఆరగించాలనే యావ తప్పా రైతులకు ఉపయోగపడే పనులు చేయడం లేదని రైతుల అంటున్నారు. జిల్లాలో ఉన్న 39 సహకార సంఘాలలో 18 సంఘాలపై వివిధ రకాలైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలు జరిగిన సంఘాలలో సంవత్సరాల తరబడి విచారణ కొలిక్కిరావడం లేదు. దీనికి కాపుగల్లు ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతే ఉదాహరణగా చెప్పవచ్చు.

నడిగూడెం మండల పరిధిలోని తెల్లబల్లి సహకార సంఘంలో సీఈఓగా పని చేస్తున్న ఉద్యోగి, ప్రజాప్రతినిధులతో కలిసి సొసైటీలోని రైతుల పేర కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకున్నారు. ఇందులో కొంతమందివి మాఫీ కాగా మరికొన్ని మాఫీ కాలేదు. దీంతో వారికి రుణాలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో వ్యవహారం బయట పడింది. అధికారులు ప్రాథమిక విచారణ చేసి సీఈఓను తొలగించారు. ఇది గడిచి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా నేటి వరకు తుది విచారణ పూర్తి కాలేదు. ఈ లోగా సదరు సీఈఓ ఉద్యోగ విరమణ చేశాడు. తాజాగా ఇక్కడి సొసైటీ పెద్దకు చెందిన బంధువు ఒకరు అన్నీ తానై వ్యవహారాలను నడుపుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇది.. మునగాల మండల పరిధిలోని తాడువాయి సహకార సంఘం. ఇందులో పనిచేస్తున్న సీఈఓ, కంప్యూటర్‌ ఆపరేటర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌లు కలిసి రైతుల రుణమాఫీ సొమ్మును తమ సొంత ఖాతాలోకి మార్చుకున్నారు. దాదాపు రూ. 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు కాజేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు సీఈఓ, కంప్యూటర్‌ ఆపరేటర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌లను సస్పెండ్‌ చేశారు. ఈ సొసైటీ చైర్మన్‌ కూడా నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయలను తన సొంతానికి వాడుకున్నట్లు సమాచారం. అక్రమార్కుల నుంచి డబ్బులు రికవరీ చేస్తామని అధికారులు చెబుతున్నా ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని రైతులు అంటున్నారు. సొసైటీ నిర్వాహకం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేవారే కరువయ్యారు.

అక్రమార్కుల నుంచి రికవరీ చేస్తాం

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాలలో సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్‌ కేసు నమోదు చేస్తున్నాం. వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తాం. సిబ్బంది ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. సంఘాల కార్యకలాపాలపై నిగా పెంచాం.

– పద్మ, డీసీఓ, సూర్యాపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement