
ఫార్మసీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్?
బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ పాస్కు అడ్డదారులు
కోదాడ: కోదాడ కేంద్రంగా కొద్ది రోజులుగా జరుగుతున్న జేఎన్టీయూహెచ్ అనుబంధ కళాశాలల బీఫార్మసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ పరీక్షల్లో భాగంగా బ్యాక్లాగ్ సబ్జెక్ట్లు రాస్తున్న విద్యార్థులకు పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నుంచి సబ్జెక్టుకు రూ.10 వేల చొప్పున లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఇక్కడ ప్రచారం సాగుతోంది. పరీక్ష రాయాల్సిన విద్యార్థులను ఓ ఫంక్షన్ హాల్ వద్ద కూర్చోబెట్టి పరీక్ష పేపర్లు, ఆన్సర్షీట్లును అక్కడికి తెచ్చి ఇచ్చి పరీక్ష రాసిన అనంతరం వాటిని తీసుకెళ్లి పరీక్షా కేంద్రంలో ఉన్న ఇతర విద్యార్థుల పేపర్లతో కలుపుతున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి కళాశాల యాజమాన్యాన్ని భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. విషయం బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని భావించిన కళాశాల యాజమాన్యం దీనిలో కొంత మొత్తం ముట్టజెప్పినా ఈ విషయం బయటకు పొక్కి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
ఏం జరుగుతుందంటే...
కోదాడలో ఉన్న ఐదు బీఫార్మసీ కళాశాలల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వందల సంఖ్యలో చదువుతున్నారు. వీరిలో కొందరు ఫైనల్ ఇయర్కు వచ్చినప్పటికి మొదటి సంవత్సరం సజ్జెక్ట్లు పాస్ కాలేదు. ఈ సారి కూడా పాస్ కాకపోతే విద్యాసంవత్సరం వృథా కావడంతో పాటు వచ్చే సంవత్సరం మళ్లీ ఇక్కడికి రావాల్సి వస్తుందని భావించి సెంటర్ నిర్వాహకులతో మాస్కాపీయింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలుంటాయి కాబట్టి అక్కడ కాకుండా వేరే చోట పరీక్ష రాసి ఆ జవాబు పత్రాలను తీసుకొచ్చి పరీక్షా కేంద్రంలోని జవాబు పత్రాలతో కలపడానికి కోదాడలోని ఓ సెంటర్ నిర్వాహకులు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీని కోసం ప్రతి విద్యార్థి నుంచి సబ్జెక్టుకు రూ.10 వేల చొప్పున సదరు సెంటర్ నిర్వాహకులు వసూలు చేశారని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
రహస్య ప్రదేశంలో..
ఒప్పందంమేరకు విద్యార్థులందరినీ ఒక రహస్య ప్రదేశం(ఓఫంక్షన్హాల్) లో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తుండగా కొందరికి సమాచారం తెలిసింది. దీంతో దాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించి కళాశాల యాజమాన్యాన్ని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. చివరకు కొంత మొత్తం ముట్టజెప్పి విషయాన్ని బయటకు రాకుండా కళాశాల యాజమాన్యం జాగ్రత్తపడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు స్థానిక విద్యార్థులు గమనించి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై జేఎన్టీయూహెచ్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అక్రమాలకు పాల్పడిన సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఓ ఫంక్షన్హాల్కు రహస్యంగా పరీక్ష పేపర్లు, ఆన్సర్షీట్లు తెచ్చి రాయిస్తున్న
సెంటర్ నిర్వాహకులు
ఇతర రాష్ట్రాల బ్యాక్లాగ్ విద్యార్థుల నుంచి కళాశాల నిర్వాహకుల వసూళ్లు!
కోదాడలో చర్చనీయాంశంగా
మారిన వ్యవహారం