ఆమదాలవలస: జిల్లా ప్రజలకు రైల్వే సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి రైల్వే శాఖ నూతనంగా మంజూరు చేసిన రైలును శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదివరకు జిల్లా ప్రజలు వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడానికి ప్రయాణం చేయాలంటే విశాఖపట్నం లేదా ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగించేవారన్నారు. కానీ ఇప్పుడు జిల్లా నుంచే వెళ్లే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. త్వరలో శ్రీకాకుళం రోడ్డు నుంచి హైదరాబాద్ వెళ్లడానికి కూడా మరో రైలు ప్రారంభించడానికి ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం లలిత్ బోహారా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు.


