జి.సిగడాం: జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు పక్కా గృహాలు మంజూరు కోసం 76 వేల గృహల కోసం సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జిల్లా గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.రమాక్రాంత్ వెల్లడించారు. గురువారం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం చేపట్టే ప్రతి ఒక్క లబ్ధిదారుడుకి 2లక్షల 39 వేల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. వీటిలో రూ.95,400లు కేంద్రప్రభుత్వం వాటా, రూ.63,600లు రాష్ట్ర ప్రభుత్వం వాటా, మిగతా రూ.80వేలు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలను మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం నియమ నిబంధనలు మేరకే బిల్లులు చెల్లింపు చేస్తామన్నారు. ఆయనతోపాటు స్థానిక ఏఈఈ గొల్లంగి యువరాజ్, రాజశేఖర్, సుధీర్, శ్రీనివాసరావుతో పాటు సిబ్బంది ఉన్నారు.


