శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దళిత మహిళను మోసగించి లైంగిక దాడికి పాల్పడిన న్యాయవాది, జిల్లా న్యాయ సేవాసమితి సభ్యుడు హర్షవర్ధన్ బెయిల్ రద్దు చేసి వెంటనే రిమాండ్కు పంపించాలని విదసం, విస్త్రృత దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిర్లో దళిత, ఆదివాసీ, ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్షవర్ధన్ జిల్లా న్యాయ సేవాసంఘంలో సభ్యుడిగా ఉన్న హోదాను అడ్డం పెట్టుకుని 50 రోజులు రిమాండ్కి వెళ్లాల్సిన కేసులో బెయిల్ పొందాడని, ప్రాసిక్యూషన్ స్పందించి బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ డి.గణేశ్ మాట్లాడుతూ హర్షవర్ధన్ను లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి, బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. యడ్ల గోపి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ లాయర్లు అసోసియేషన్ జిల్లా నాయకులు బి.మురళీకృష్ణ, వివిధ సంఘాల నాయకులు బడియా కామరాజు, సవాలపురపు కృష్ణవేణి, రాకోటి రాంబాబు, దండాసి రాంబాబు, అర్జి ఈశ్వరరావు, అర్జి కోటి, వన్నలి లక్ష్మీనారాయణ, టి.రమణ తదితరులు పాల్గొన్నారు.


