శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కిరణ దర్శనానికి వేళయ్యింది. ఈ నెల 9, 10 తేదీల్లో ఉదయం 6 నుంచి 6.30 వరకు కిరణ దర్శనం ఉండవచ్చని ఆలయ వర్గాలు తెలిపాయి. మబ్బులు, పొగమంచు లేకుండా వాతావరణం బాగుంటేనే స్వామి కిరణదర్శనం ఉంటుందని పేర్కొన్నారు.
9న ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిస్ మేళా
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 9న ప్రధానమంత్రి జాతీయ అంప్రెటిస్ మేళా నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్, కన్వీనర్ ఎల్.సుధాకరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని తొమ్మిది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో వివిధ ట్రేడ్లలో శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులు మూడు బయోడేటాలు, ధ్రువపత్రాలు, ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. ఎంపికై న వారికి అరబిందో, శ్యాంక్రగ్ పిస్టన్స్, స్మార్ట్కెమ్, కాడ్మ్యాక్స్, బ్లూస్టార్, నోర్డిక్స్ వంటి కంపెనీల్లో అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కొబ్బరిమొక్కలు కొందరికే..!
కంచిలి: ప్రకృతి వైపరీత్యాలు, వయస్సు పైబడి వ్యాధులబారిన పడిన కొబ్బరి చెట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటడం, నిర్వహణ కోసం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కొబ్బరి విస్తరణ పథకాన్ని కొందరు రైతులకే వర్తింపజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంచిలి మండలం పెద్దశ్రీరాంపురంలో 67 మంది రైతులు తమకు పథకాన్ని వర్తింపజేయాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. గడువు దాటిన తర్వాత దరఖాస్తులు వచ్చాయనే నెపంతో ఉద్యానశాఖ యంత్రాంగం వీటిని పక్కన పెట్టేశారు. జనవరి 21న ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఇంతవరకు దరఖాస్తుదారులతో గ్రామసభ నిర్వహించలేదు. పైగా ప్రతి ఫిర్యాదుకు చివరి రోజు వచ్చి ఫిర్యాదుదారునితో ఫొటో తీసుకొని వెళ్లిపోతున్నారని ఫిర్యాదుదారుడు బల్లెడ సునీల్ గురువారం తెలిపారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
నాలుగు ఎకరాల గడ్డివాములు దగ్ధం
బూర్జ: పాలవలస గ్రామంలో తుమ్మలపల్లి వెంకటనాయుడుకు చెందిన నాలుగు ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు పాలకొండ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఏడాది పాటు పశువులకు సరిపడా గడ్డి వాములు నిల్వ ఉంచుకున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేస్తున్నారు.
మందుగుండు సామగ్రి పట్టివేత
రణస్థలం: లావేరు మండలం వెంకటాపురంలో గేదెల సూర్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో మందుగుండు సామగ్రిని టాస్క్ఫోర్స్ ఎస్సై నరసింహమూర్తి, సిబ్బంది పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు గురువారం సాయంత్రం సూర్యనారాయణ ఇంట్లో తనిఖీ చేయగా వత్తుల మందు, తార జువ్వల మందు, తాటిరేకుల కట్ట, చిచ్చు బుడ్డీలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని లావేరు పోలీసులకు అప్పగించారు. ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేశారు.
బార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయవాదుల బార్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.ద్వారకా రెడ్డి గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 9న తుది ఓటరు జాబితా ప్రకటన, 12న ఎన్నికల నోటిఫికేషన్, 13న ఎన్నికల అధికారి నియామకం, 16న నామినేషన్ల స్వీకరణ, 17న నామినేషన్ల పరిశీలన, 18న నామినేషన్ల ఉప సంహరణ, 19న పోటీలో ఉన్నవారి తుది జాబితా విడుదల ఉంటుంది. 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఓటింగ్, అనంతరం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
సునీల్కు నోటీసు ఇస్తున్న సచివాలయ వీహెచ్ఏ


