
ఆన్లైన్ వైద్యంతో అనర్థం
● కోటబొమ్మాళి మండలానికి చెందిన సుమారు 55 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయినై తనిఖీ చేయించుకుంటే హార్ట్లో బ్లాక్ ఉందని తేలింది. అతనికి స్టంట్ వేయాలని వైద్యులు నిర్ధారించారు. ఈ శస్త్రచికిత్స జరుపుతుండగానే అతను మృత్యువాతపడ్డాడు. అంతకుముందు అతను ఐదు రోజుల పాటు ఛాతీలో నొప్పితో బాధపడ్డాడు. గ్యాస్ వల్ల కావచ్చని ఆన్లైన్లో వెతికి అక్కడ సూచించిన మందులు వాడి తగ్గకపోవడంతో ఆస్పత్రిని ఆశ్రయించాడు. అప్పటికే చేయిదాటిపోయింది.
● నరసన్నపేట మండలానికి చెందిన ఓ వ్యక్తికి జ్వరం, కళ్లు మంటలు, తలనొప్పితో బాధపడ్డాడు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడికి ఈ విషయం చెప్పగా అతను ఆన్లైన్లో వెతికి మందులను వాడాలని కొన్నింటిని సూచించాడు. వారం రోజులు వాడినా తగ్గకపోవడంతో వైద్యుల వద్దకు వెళ్లగా అతనికి మెదడులో సమస్య ఉన్నట్లు పరీక్షల అనంతరం నిర్ధారించి విశాఖపట్నం తీసుకెళ్లారు.
శ్రీకాకుళం:
జిల్లాలో చాలా మంది ఆన్లైన్ వైద్యం వైపు మొగ్గుచూపుతూ మరింతగా అనారోగ్యానికి గురవుతున్నారు. గతంలోనే ఈ జాఢ్యం ఉండగా ఏఐ లాంటి సైట్లు వచ్చిన తరువాత ఇది మరింత పెరిగిపోయింది. ఆన్లైన్ వైద్యాన్ని నమ్మి, వైద్యులు చెబుతున్న దాన్ని కూడా అనుమానించే పరిస్థితికి కొందరు యువత చేరుకుంటున్నారు. జిల్లాలో రెండు వేలు వరకు మెడికల్, హోల్సెల్, రిటైల్ షాపులు ఉన్నాయి. 10 వేల మంది వరకు ఎంబీబీఎస్, స్పెషాలిటీ, సూపర్ స్పషాలిటీ వైద్యులు ఉన్నారు. 10 పైగా పెద్ద ఆసుపత్రులు ప్రైవేటుగా, ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇవి కాకుండా గ్రామస్థాయిలో 1000 మంది వరకు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ఉన్నారు. ఇది వరకు వీరిలో ఎవరినో ఒకరిని సంప్రదించి, వైద్యం చేయించుకునేవారు. ఇటీవల కాలంలో యువత ఈ విధానాన్ని విడిచిపెట్టి ఆన్లైన్ బాటపడుతున్నారు. తమకు, తమ బంధువులకు ఉన్న రోగాలను నిర్ధారించుకొని, ఆన్లైన్లో సూచించినట్లు మందులను వాడేస్తున్నారు. కొందరు లేని జబ్బులకు వైద్యం చేసుకోవడం, మరి కొందరు ఉన్న జబ్బును కూడా అది కాదనుకొని ఆన్లైన్లో సూచించిన మందులను వాడేయడం వల్ల రోగాన్ని ముదర పెట్టుకుని కష్టాలు పాలవుతున్నారు. ఇటువంటి వైద్యం అనార్థదాయకమని వైద్యులు చెబుతుండగా, దానిని కూడా పెడ చెవిన పెడుతున్నారు. వైద్యులు డబ్బు కోసమే అలా చేస్తున్నారని, వాదిస్తున్నారు. వాస్తవానికి, వైద్యులు రోగిని స్వయంగా పరిక్షించి, అవసరమైతే రక్త పరీక్షలు ఇతర తనిఖీలు చేసి రోగాన్ని నిర్ధారించిన తర్వాతే చికిత్సలు ప్రారంభిస్తారు. ఇవేవీ లేకుండా వైద్యం చేయించుకోవడం వల్ల తీవ్ర నష్టాలు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
లక్షణాలను బట్టి నిర్ధారణ కష్టం
రోగికి ఉన్న లక్షణాలను బట్టి వ్యాధిని నిర్ధారించలేం. ఒకే రకమైన లక్షణాలు అనేక రోగాల్లో ఉంటాయి. రోగిని పరీక్షించి మరికొన్ని తనిఖీలు చేసిన తర్వాతే వాధిని నిర్ధారించగలుగుతాం. ఆన్లైన్ చూసి సొంతంగా వైద్యం చేసుకోవడం సరైన పద్ధతి కాదు.
– డాక్టర్ డి.పార్వతి, శ్రీకాకుళం
ప్రమాదకరం
ఆన్లైన్లో సూచించినట్లు వైద్యం చేసుకోవడం అత్యంత ప్రమాదకరం. జబ్బు తగ్గుతుందో లేదో అటుంచితే కాలాన్ని వృథా చేయడం వల్ల వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉంటుంది. వైద్యులను నేరుగా సంప్రదించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం.
– డాక్టర్ ఎల్.ప్రసన్నకుమార్, శ్రీకాకుళం
నెట్లో చూసి సొంత వైద్యం చేసుకుంటున్న జిల్లావాసులు
సొంత వైద్యంతో అనర్థాలను కొని తెచ్చుకుంటున్న వైనం

ఆన్లైన్ వైద్యంతో అనర్థం

ఆన్లైన్ వైద్యంతో అనర్థం