
మొక్కజొన్నకు ‘మద్దతు’ కరువు..!
● తక్కువకు కొనుగోలు చేస్తున్న దళారులు ● బస్తాకు రూ.125ల వరకు నష్టపోతున్న వైనం ● పట్టించుకోని అధికారులు
నరసన్నపేట:
ఎన్నో ఆశలతో మొక్కజొన్న పండించిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించడం లేదు. ప్రస్తుతం పంట పూర్తిగా కోతకు వచ్చి దిగుబడులు రైతుల చేతికొచ్చాయి. అయితే ఆశించిన ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ రెండో వారం నుంచి మొక్కజొన్న కోతకు రాగా.. ఇప్పటికీ ధర పెరగగపోవడంతో రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో 9000 ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ఎకరాకు 30 నుంచి 45 బస్తాల వరకు దిగుబడి వస్తున్నా మద్దతు ధర రాకపోవడంతో ఆశించిన ఆదాయం పొందలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న వంద కేజీల బస్తాకు రూ.2,225లుగా మద్దతు ధర ప్రకటించింది. అయితే జిల్లాలో అధికారికంగా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులే దిక్కు అయ్యారు. వీరితో పాటు ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధరకే రైతులు విక్రయాలు చేయాల్సి వస్తోంది. దళారులు బస్తాకు 101 కేజీలు తీసుకుంటున్నారు. అరువు పద్ధతిన బస్తాను రూ.2,100 కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు బస్తాపై సుమారుగా రూ.125లు మేరకు మద్దతు ధర నష్టపోతున్నారు. అదే జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు అంటున్నారు. వ్యవసాయ మంత్రి ఇదే జిల్లాలో ఉన్నా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని రైతులు అంటున్నారు. బస్తాపై రూ.125 చొప్పున లెక్క వేస్తే ఒక ఎకరా పండించే రైతు దాదాపు రూ.3,100 నుంచి రూ.5 వేల వరకు నష్టపోతున్నాడు.