
అర్ధరాత్రి విధ్వంసం
ఊళ్లన్నీ ఆదమరిచి నిద్దరోతున్న వేళ.. గురువారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఓ వైపు
ఉరుములు, మెరుపులతో ఆకాశం
భయపెడుతుంటే.. బలంగా వీచిన గాలులు విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇళ్లపైకప్పులను నేల కూల్చాయి. అరటి, మామిడి వంటి పంటలను నాశనం చేశాయి.
● అరటి తోటలు ధ్వంసం
నరసన్నపేట: ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు ధ్వంసమైపోయాయి. కోమర్తి, మాకివలసల్లో రైతులు బాగా నష్టపోయారు. కోమర్తిలో లబ్బ రాము, లబ్బ శ్రీను, పంచిరెడ్డి సింహాచలం లతో పాటు పలువురు రైతుల అరటి తోటలు పడిపోయాయి.
● గాలి తీవ్రతతో విద్యుత్కు అంతరాయం
అరసవల్లి: గురువారం అర్ధరాత్రి తీవ్రమైన గాలు లు జిల్లాపై విరుచుకుపడ్డాయి. ఈ ప్రభావం జిల్లా కేంద్రంతో పాటు డివిజన్లో పలు మండలాల్లో విద్యుత్ సరఫరాపై పడింది. దీంతో అర్ధరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా పలు చోట్ల విద్యుత్ అంతరాయం వాటిల్లింది. శ్రీకాకుళం, గార, బూర్జ, నరసన్నపేట, ఆమదాలవలస తదితర మండలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అర్ధరాత్రి గాలుల తీవ్రత కొనసాగడంతో విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరించే వీలు లేకపోయింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి విద్యుత్ శాఖ ఆపరేషన్స్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఈఈ పైడి యోగేశ్వరరావులు రంగంలోకి దిగి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కాంట్రాక్టర్ ఉంగటి పాపారావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్లుగా పంపించి ఎక్కడికక్కడ విద్యుత్ పునరుద్ధరణ పనులను మొదలు పెట్టించారు. దీంతో మ ధ్యాహ్నం సమయానికి విద్యుత్ సరఫరాను పలు ప్రాంతాలకు అందించారు. అయినప్పటికీ శ్రీకాకు ళం రూరల్, గార తదితర మండలాల్లో శుక్రవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ శాఖ పరంగా నష్టాన్ని అంచనాగా రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి అవసరమైన చోట కొత్తగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయించారు. ఇదిలావుంటే నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఈఈ యోగేశ్వరరావు స్వయంగా పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు.
● వర్షం, గాలుల బీభత్సం
ఎచ్చెర్ల క్యాంపస్: వర్షం, గాలులు గురువారం రాత్రి బీభత్సం సృష్టించాయి. పొన్నాడలో రాము, రవి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లపై విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. గ్రామస్తులు ఫిర్యాదు చేయగా విద్యుత్ సరఫరా నిలిపివేసి, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కేశవ రావుపేట శివారులో చీడిఖాన్ చెరువు గట్టుపై ఉన్న అమ్మవారి వేప చెట్టు కూలిపోయింది. మండలంలో జీడి మామిడి, మామిడి పంటకు తీరని నష్టం వాటిల్లింది. విద్యుత్ అంతరాయాలు కలగగా శుక్రవారం సాయంత్రం నాటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
శ్రీకాకుళం డివిజన్లోనే
రూ.10 లక్షల వరకు విద్యుత్ నష్టం

అర్ధరాత్రి విధ్వంసం

అర్ధరాత్రి విధ్వంసం