
చీడిపూడిలో రేషన్ సరుకుల పంపిణీలో కోత
● గిరిజనులకు అందని ఏప్రిల్ నెల రేషన్ సరుకులు
● స్పందించని అధికారులు
సంపాదనలో సగం బియ్యానికే..
మా కుటుంబానికి బియ్యం ఇవ్వకపోవడంతో నా భర్త చేసిన కూలి డబ్బులతో సగం బియ్యం కొనాల్సి వస్తోంది. మా లాంటి వారికి రేషన్ బియ్యం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.
– బెజ్జి అరుణ, బాధితురాలు
ఊరివారే సాయం చేశారు
నేను ఒక్క దాన్నే ఇంట్లో ఉంటాను. ఎలాంటి ఆధారం లేదు. రేషన్ బియ్యంతో నెల మొత్తం గడుస్తుంది. ఇప్పుడు బియ్యం ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నాను. ఊర్లో వాళ్లంతా పిడికెడు బియ్యం సాయం చేస్తున్నారు.
– మంగపేట ఆదమ్మ, బాధితురాలు
పక్కింటి నుంచి తెచ్చుకుంటున్నాం..
మాకు గత నెల రేషన్ బియ్యం ఇవ్వలేదు. రేషన్ బియ్యం కో సం వేలిముద్రలు తీసుకున్నా రు. అయినా సరుకులు ఇవ్వలేదు. పక్కింటి నుంచి బియ్యం అప్పు తెచ్చుకుని రోజులు గడుపుతున్నాం.
– మంగపేట నారాయణరావు
టెక్కలి: రేషన్ ఇచ్చేస్తామన్నారు.. అందరి దగ్గరా వేలి ముద్రలు తీసుకున్నారు.. అదిగో ఇదిగో అంటూ నెల గడిపేశారు. ఆఖరికి ఏప్రిల్నెల రేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ సవరసొర్లిగాం గిరిజన గ్రామంలో సుమారు 200 మంది గిరిజనులకు గత నెల రేషన్ సరుకులు పంపిణీ చేయలేదు. వేలిముద్రలు సైతం తీసుకుని చివరకు రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో ఆయా కుటుంబాలు అనేక అవస్థలు పడుతున్నాయి. పంచాయతీ పరిధిలో డిపో నంబర్ 791 పరిధిలో సొర్లిగాం, సవరసొర్లిగాం, సన్యాసిపేట, హరిపురం, సతివాడ, బలరాంపు రం తదితర గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒక్క సవర సొర్లిగాం గ్రామంలో 62 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో సుమారు 200 మంది జనాభా ఉన్నారు. వారందరికీ ఏప్రిల్లో రేషన్ ఇవ్వలేదు. రెండు రోజుల కిందట ఎండీయూ సిబ్బంది రేషన్ పంపిణీ కోసం వెళ్తే ఏప్రిల్ నెల రేషన్ ఇస్తే తప్ప మే నెల రేషన్ తీసుకోబోమని వారు చెప్పడంతో, తమకేమీ సంబంధం లేనట్లుగా ఆ సిబ్బంది వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఏప్రిల్, మే నెలల రేషన్ అందించాలని గిరిజనులు కోరుతున్నారు.
సారవకోట: మండలంలోని చీడిపూడి గ్రామంలో రేషన్ సరుకుల పంపిణీలో కోత విధిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామ రేషన్ డీలర్ను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించారు. అప్పటి నుంచి రేషన్ సరుకులు వీఆర్వో అథంటికేషన్తో ఇస్తున్నారు. అయితే ఏప్రిల్లో లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వకుండానే లబ్ధిదారులతో బయోమెట్రిక్ వేయించుకున్నారు. మే నెల రేషన్ సరుకులు గురు వారం నుంచి సరఫరా చేస్తున్నారు. అయితే 5 కిలోలు, 10 కిలోలు ఉన్న లబ్ధిదారులకు మాత్రమే పూర్తిస్థాయి సరుకులు ఇస్తున్నారని మిగిలిన వారికి 3 కిలోలు చొప్పున కోత విధిన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని పై వీఆర్ఓ రాపాక లక్ష్మీనారాయణను వివరణ కోరగా అలాట్మెంట్ తక్కువగా వచ్చిందని, అందుకే కోత విధిస్తున్నామని తెలిపారు.

చీడిపూడిలో రేషన్ సరుకుల పంపిణీలో కోత

చీడిపూడిలో రేషన్ సరుకుల పంపిణీలో కోత

చీడిపూడిలో రేషన్ సరుకుల పంపిణీలో కోత