
ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే మద్యం వ్యాపారం
● మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజం
పాతపట్నం:
మండల కేంద్రం పాతపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. మద్యం షాపు వద్ద స్థానికులు, పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రోత్సాహంతోనే ఇళ్ల మధ్య మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కాలనీకి చెందిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులు వెంటనే మద్యం దుకాణం ఎత్తివేయించాలన్నారు. లేకపోతే ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు. మద్యం దుకాణాలు దేవాలయాలు, పాఠశాలలు, హైవేకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఐటీ వింగ్ విభాగం ప్రతినిధి ఎనుగుతల సూర్యం, జిల్లా సెక్రటరీ అమర రమణ, నాయకులు గోకవలస రాము, వంశీ, ఫల్గుణరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.