కొన్న చిన్నారావు మెమోరియల్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ వాయిదా | - | Sakshi
Sakshi News home page

కొన్న చిన్నారావు మెమోరియల్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ వాయిదా

Sep 23 2023 1:35 AM | Updated on Sep 23 2023 1:35 AM

మాకివలసలో ఈకేవైసీ తీరును పరిశీలిస్తున్న ఏడీ రవీంద్రభారతి  - Sakshi

మాకివలసలో ఈకేవైసీ తీరును పరిశీలిస్తున్న ఏడీ రవీంద్రభారతి

శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతికూల వాతావరణం కారణంగా చిన్నారావు మెమోరియల్‌ అథ్లెటిక్స్‌ పోటీలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పోటీలు నిర్వహించాల్సి ఉండగా వర్షాలు కురుస్తుండడం, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్కూల్‌గేమ్స్‌ పోటీలు, ఆడుదాం ఆంధ్ర, ఇతరత్రా క్రీడా పోటీల షెడ్యూల్స్‌ వెలువడిన నేపథ్యంలో కొన్న చిన్నారావు మెమోరియల్‌ అథ్లెటిక్స్‌ పోటీలను నిర్వాహకులు తాత్కాలికంగా వాయిదా వేశారు. సరికొత్త షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేసి ప్రకటించనున్నట్లుగా కొన్న చిన్నారావు కుటుంబ సభ్యులు కొన్న సత్యనారాయణమూర్తి, కొన్న వెంకటేశ్వరరావు(వాసు), కొన్న మధుసూదనరావు, పూడి బాలాదిత్య, ప్రగడ అశోక్‌కుమార్‌, అథ్లెటిక్స్‌ సంఘ ప్రతినిధులు తెలియజేశారు.

‘ఈ–క్రాప్‌ తప్పనిసరి’

నరసన్నపేట: రైతులు తప్పనిసరిగా తమ పంటలకు ఈ క్రాప్‌ బుకింగ్‌ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ రవీంద్ర భార తి అన్నారు. ఈ బాధ్యతను సచివాలయాల వీఏఏలు తీసుకోవాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాకివలసలో ఈ–క్రాప్‌ బుకింగ్‌, వేలిముద్రల సేకరణ (ఈకేవైసీ) ప్రగతిని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ క్రాప్‌ బుకింగ్‌ కాకపోతే ప్రభు త్వం నుంచి ఎలాంటి రాయితీలు రావని వివరించారు. రైతులు గమనించి తమ ఆధార్‌ కార్డు, భూముల వివరాలతో సంబంధిత వీఏఏలను కలవాలని సూచించారు. అలాగే వీఏఏలు రైతులకు తగిన విధంగా చైతన్యం చేయాలని ఆదేశించారు. నరసన్నపేట ఏడీ పరిధిలో 74,315 ఎకరాల్లో పంటలు పండిస్తుండగా ఇప్పటి వరకూ 65,327 ఎకరాలకు ఈ క్రాప్‌ బుకింగ్‌ అయిందని అన్నారు. ఈకేవైసీ కూడా కేవలం 28 శాతం మంది రైతులే చేశారని, ఇంకా 72 శాతం చేయాల్సి ఉందని రైతులు త్వరిత గతిన ఈకేవైసీ పూర్తి చేయాలని సూచించారు.

వంద గంటల దివ్య అఖండ భజన ప్రారంభం

శ్రీకాకుళం కల్చరల్‌: సత్యసాయి బాబా జయంత్యుత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం పెద్ద మందిరంలో 100 గంటల దివ్య అఖండ నామ సంకీర్తనను రాష్ట్ర సత్యసాయి సేవాసంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.లక్ష్మణరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంతటా ఈ 100 గంటల అఖండ నామ సంకీర్తన కార్యక్రమం ప్రారంభించామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, పోటీలు ఈనెల 26,29 తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రథమ బహుమతి పొందిన వారికి నవంబరు 23న బాబా వారి జయంతి రోజున ప్రశాంతి నిలయంలో బంగారు పతకం, సర్టిఫికెట్‌ అందిస్తామన్నారు.

మహిళా బిల్లుపై జిల్లా బార్‌ అసోసియేషన్‌ హర్షం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదం పొందడంపై జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్ని సూర్యారావు హర్షం వ్యక్తం చేశారు. బిల్లుకు వైఎస్సార్‌ సీపీ మద్దతు పలకడం సంతోషకరమన్నారు. బడుగు, బలహీన వర్గాల మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించడానికి ఇది దోహదపడుతుందన్నారు. మహిళా ప్రతినిధులు హరిప్రియ, జి.లక్ష్మి, సత్యవాణి, ఎ.ఉషా రాణి, చందన, డి.విజయలక్ష్మి, విశాలాక్షి తదితరులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

రైలు ప్రమాదం మృతుడి వివరాలు లభ్యం

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో బుధవారం రైలు ఢీకొని చనిపోయిన వ్యక్తిని ఇచ్ఛాపురం వాసిగా గుర్తించినట్లు ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్‌ తెలిపారు. పట్టణంలోని కస్పావీధికి చెందిన బుల్లు మహంతి(33) మూడు రోజులుగా ఇంటికి వెళ్లలేదు. బుధవారం స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొట్టి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడ నే వార్త బయటకు రావడంతో కుటుంబ సభ్యులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి గుర్తు పట్టారని ఎస్‌ఐ తెలిపారు. శుక్రవారం పలాస ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బుల్లు మహంతి  1
1/1

బుల్లు మహంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement