పంట లెక్క.. ఇక పక్కా! | - | Sakshi
Sakshi News home page

పంట లెక్క.. ఇక పక్కా!

Sep 23 2023 1:35 AM | Updated on Sep 23 2023 1:35 AM

ముండ్ల గ్రామంలో రైతుకు ఫొటో తీసి, వివరాలు నమోదు చేస్తున్న దృశ్యం - Sakshi

ముండ్ల గ్రామంలో రైతుకు ఫొటో తీసి, వివరాలు నమోదు చేస్తున్న దృశ్యం

కంచిలి: జిల్లాలో పంటల లెక్క ఇక పక్కాగా జరగనుంది. రైతులకు ప్రభుత్వ రాయితీలు, సంక్షేమాలు అందజేసేందుకు ఈ–క్రాస్‌ బుకింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది. ఈ–కర్షక్‌ యాప్‌లో కొత్త మాడ్యూల్‌ ఏర్పా టు చేశారు. ఈ విధానం వల్ల మరింత పారదర్శకంగా అన్ని రకాల పంటల నమోదు జరిగి, ప్రభుత్వపరంగా చేపడుతున్న వివిధ సేవలు మరింత పకడ్బందీగా చేరుతాయి.

జిల్లా వ్యాప్తంగా 4,42,775 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానశాఖల పరిధిలో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 3,96,953 ఎకరాల్లో ఈ క్రాప్‌ నమో దు చేశారు. ఈ నెల 30వ తేదీతో వ్యవసాయ శాఖ పరిధిలో పంటలకు ఈ క్రాప్‌ నమోదుకు గడువు పూర్తవుతుంది. ఆలోగా రైతులందరికీ ఈ–క్రాస్‌ బుకింగ్‌ పూర్తి చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు.

గతంలో ఇలా..

● గతంలో ఏయే సర్వే నంబర్లలో రైతులు ఏయే పంటలు సాగు చేస్తున్నారో వ్యవసాయ విస్తరణాధికారి నమోదు చేసి, వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేవారు.

● గతంలో కూడా ఈ–క్రాప్‌ బుకింగ్‌ చేసే విధానంలో యాప్‌లో సర్వే నంబర్‌ నమోదు చేసి, ఏదో ఒక పొలం వద్ద రైతును నిలబెట్టి ఫొటో తీసేవారు.

● అలాగే గ్రామంలోని పెద్ద రైతుల నుంచి సమాచారం తీసుకోవడం, లేదా రైతు చెప్పింది మాత్రం నమోదు చేయడం చేసేవారు.

● దీంతో వివిధ రకాల పంటలు ఏ మేరకు సాగవుతున్నాయో పూర్తిస్థాయిలో స్పష్టత ఉండటం లేదని ప్రభుత్వం గుర్తించింది.

● దీంతో ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.

● గ్రామ వ్యవసాయ సహాయకుల ట్యాబ్‌లో నూతన సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేసి, దాని సహాయంతో ఈ–క్రాప్‌ నమోదు చేస్తున్నారు.

● నూతన విధానంలో గ్రామ వ్యవసాయ సహాయకులు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది.

జియోఫెన్సింగ్‌తో అనుసంధానం..

గ్రామ వ్యవసాయ సహాయకులకు ఈ–కర్షక్‌ యాప్‌ జియోఫెన్సింగ్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న ట్యాబ్‌లో అటెండెన్స్‌తో పాటు రోజువారీ విధుల వివరాలు, రైతు భీమా, రైతు బంధు అప్‌డేట్‌ నమోదు చేసేవారు. ఇందులోనే ఈ–క్రాప్‌ బుకింగ్‌ చేసేవారు. అయితే క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే పంటల వివరాలు నమోదు చేసేలా ఇది ఉండేది. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త మార్పులు చేసింది. సంబంధిత సర్వే నంబర్‌ పొలానికి వెళ్లినప్పుడు మాత్ర మే వివరాలు కనిపించేలా మాడ్యూల్‌ రూపొందించింది. సర్వే నంబర్‌కు వెళ్లినప్పుడు గూగుల్‌ జియోఫెన్స్‌ ద్వారా ఆ లొకేషన్‌కు చేరుకుంటారు. 200 మీటర్లు దూరంలో ఉన్నప్పుడు మాత్రమే సర్వే నంబర్‌ వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. అప్పుడే నమోదు చేయాల్సి ఉంటుంది.

త్వరితగతిన నమోదు

సోంపేట, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, రణస్థలం, కొత్తూరు వ్యవసాయ సబ్‌ డివిజన్లలో 30 మండలాల్లో ఈ ప్రక్రియ త్వరితగతిన చేస్తున్నారు. ఆయా మండలాల్లో మండల వ్యవసాయాధికారులు నూతన విధానంలో సర్వే నంబర్లను వెబ్‌ల్యాండ్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి, గ్రామస్థాయిలో వ్యవసాయ సహాయకులకు కేటాయిస్తారు. ఆ సర్వే నంబర్లను గ్రామ వ్యవసాయ సహాయకులు ఈ–కర్షక్‌ వెబ్‌ లాగిన్‌లో అప్‌డేట్‌ చేసుకుంటారు. అనంతరం ఈ–కర్షక్‌ మొబైల్‌ యాప్‌లో జియోఫెన్సింగ్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని పంట నమోదు ప్రక్రియను ప్రారంభిస్తారు. ఒక సర్వే నంబర్‌కు వెళ్లినప్పుడు ఆ సర్వే నంబర్‌ జియో కో–ఆర్డినేట్స్‌ ఓపెన్‌ అవుతాయి. సర్వే కోసం వ్యవసాయ సహాయకులు క్షేత్రస్థాయి సర్వే నంబర్‌కు వెళ్తేనే యాప్‌ ఓపెన్‌ అవుతుంది. వివరాలు నమోదు చేయగానే అప్పుడు సర్వే నంబర్‌ ఎరుపు నుంచి పసుపు పచ్చ రంగుకు మారుతుంది. అప్పుడు మాత్రమే వివరాలు నమోదైనట్లు పరిగణిస్తారు.

నూతన విధానంతో పంటల నమోదు ప్రక్రియ

ఈ–క్రాప్‌ బుకింగ్‌లో కొత్త విధానం

క్షేత్రస్థాయికి వెళ్తేనే ఓపెన్‌ కానున్న సర్వే నంబర్‌

జిల్లాలో త్వరితగతిన పంటల నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement